(న్యుస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి గ్రామ సచివాలయాల పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తను ప్రభుత్వం ఖండిస్తున్నది. ఇప్పటికి అందుతున్న సూచనల ప్రకారం తాము వెల్లడించిన పరీక్షా ఫలితాలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు కనబడుతోంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త కాబట్టి లీకేజిని యెల్లో మీడియా దుష్ప్రచారం కింది వైసిపి నేతలు కొట్టి పడేస్తున్నారు.
ప్రశ్నాపత్రం లీకయిందన్న వార్తాకధనానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రత్యక్ష ఆధారాలు చూపించలేదు. లీకయిన ప్రశ్నాపత్రం, లీకేజి ప్రక్రియ తాలూకూ ఆడియో వీడియో వంటి సాక్ష్యాధారాలను ఆ కథనానికి జోడించలేదు. పరోక్ష ఆధారాలు చూపించారు. ఎపిపిఎస్సిలో పొరుగుసేవల ఉద్యోగులు టాప్ ర్యాంకులు సాధించడం, అన్నా చెల్లెళ్లు, అన్నాతమ్ములు టాప్ ర్యాంకులు సాధించడం వంటి సంభవాత్మక సాక్ష్యాలను ఆ పత్రిక చూపించింది.
అంతమాత్రాన లీకేజి వార్తలను కొట్టిపారవేయడం సరైన చర్యగా కనిపించడం లేదు. ఈ వ్యవహారంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎపిపిఎస్సిలో కాన్ఫిడెన్షియల్ విభాగంలో పొరుగు సేవలు నిషిద్ధం, క్యాటగిరీ1లో టాప్ ర్యాంక్ సాధించిన అనితమ్మ అలాంటి పొరుగు సేవల ఉద్యోగే. అనితమ్మ గతంలో పంచాయితీ కార్యదర్శి పోస్టుకు ఎంపిక కాలేదు. అలాంటి వ్యక్తి ఏకంగా 112 మార్కులతో టాప్ ర్యాంక్ సాధించడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి అన్ని క్యాటగిరీలకూ కలిపి 19.50 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే వారిలో 1005 మంది మాత్రమే వందకు పైగా మార్కులు సంపాదించుకున్నారు. అంటే 0.05 శాతం అన్నమాట. అలాంటి పోటీలో అనితమ్మ ర్యాంకు సందేహాలను మిగుల్చుతున్నదంటే దానిని తప్పు పట్టడం కష్టం. అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం చేస్తున్న మరో వ్యక్తికి కూడా మంచి మార్కులు వచ్చినట్లు చెబుతున్నారు. మూల్యాంకనంలో కూడా చాలా లోపాలు ఉన్నట్లు కొందరు అభ్యర్ధులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ సందేహాలకు సమాధానం ఇవ్వకుండా ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లిన పక్షంలో ఎపిపిఎస్సి విశ్వసనీయతే ప్రశ్నార్ధకంగా మారుతుంది.