విశాఖ, మార్చి 30: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర ప్రజలు విశాఖ పార్లమెంట్ స్థానంపై ఆసక్తి చూపుతున్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పని చేసిన సమయంలో వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేసిన వివి లక్ష్మీనారాయణ అక్కడ పోటీలో ఉండడమే అందుకు కారణం. జెడి లక్ష్మీనారాయణగా ప్రసిద్ధుడైన ఆ సిబిఐ అధికారి జగన్ను అప్పట్లో అరెస్టు చేయడంతో ఆయన పేరు సినీ హీరో మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్నా పెద్దా అందరి నోళ్లలో నానింది.
స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్న తరువాత ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి రైతులు, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, విద్యార్థులు, మేధావుల సదస్సుల్లో పాల్గోని సందేశాలు ఇవ్వడంతో వివి లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానంపై ఊహాగానాలు మొదలయ్యాయి. సొంతగా రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన చేసిన వివి లక్ష్మీనారాయణ చివరి నిమిషంలో జనసేన పార్టీలో చేరి విశాఖ పార్లమెంట్ బరిలో ఆ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. ఇదే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అందరి చూపు విశాఖపై కేంద్రీకృతం అవుతోంది.
విశాఖ పార్లమెంట్ సీటుకోసం టిడిపి నుండి సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, మాజీ ఎంపి ఎంవివిఎస్ మూర్తి మనుమడు భరత్, వైసిపి నుండి రియల్ ఎస్టేట్ బిల్డర్ ఎంవివి సత్యనారాయణ, బిజెపి నుండి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, కాంగ్రెస్ పార్టీ నుండి రమణి కుమారి పోటీ పడుతున్నారు. ఇక్కడి నుండి జనసేన అభ్యర్థిగా వివి లక్ష్మీనారాయణ పోటీలో ఉండటం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన కల్గిస్తుంది.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విశాఖపట్నం నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు శృంగవరపుకోట, భీమిలి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
1952నుండి ఇప్పటి వరకూ జరిగిన 16లోక్సభ ఎన్నికల్లో 1984,1991,1999లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈ లోక్సభ స్థానం నుండి విజయం సాధించారు. తొమ్మిది పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా గత 2014 ఎన్నికల్లో టిడిపి పొత్తుతో బిజెపి అభ్యర్థి కె హరిబాబు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై 66వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 3లక్షలకు పైగా ఓట్లు రాగా టిడిపి అభ్యర్థి డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి 2లక్షల 23వేల ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
విశాఖ పార్లమెంట్ పరిధిలో విశాఖ పోర్టు, బిహెచ్ఇఎల్, విశాఖ స్టీల్, షిప్ యార్డ్, తదితర భారీ పరిశ్రమలు ఉండగా వామపక్ష పార్టీల ట్రేడ్ యూనియన్లు బలంగా ఉన్నాయి. వామపక్ష, బిఎస్పి, జనసేన కూటమి అభ్యర్థిగా రంగంలో ఉన్న వివి లక్ష్మీనారాయణకు వ్యక్తిగత ఇమేజ్తో పాటు పార్టీ బలం తోడు అవ్వడం ప్రత్యర్ది పార్టీలలో గుబులు రేకెత్తిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఐపిఎస్ అధికారిగా, వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా అనేక విజయాలు సాధించి మంచి వ్యక్తిగత ఇమేజ్ సొంతం చేసుకున్న జెడి ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఏ మేర విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంటుంది.