హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారపక్షాల మధ్య సుహృద్భావం వెల్లివిరుస్తోంది. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి ఒకే కారులో రాజ్భవన్లో ఇఫ్తార్ విందుకు వెళ్లారు. నిన్న హైదరాబాద్లోని ఎపి భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి అప్పగించారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టు బోర్డులో టిఆర్ఎస్కు ప్రాతినిధ్యం ఇస్తారని వినబడుతోంది.
ప్రస్తుతం టిడిపికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన టిటిడి ట్రస్టు బోర్డు పని చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన మీదట గత ప్రభుత్వం నియమించిన పాత పాలక మండలులు రాజీనామా చేస్తాయని అనుకున్నారు. అయితే సుధాకర్ యాదవ్ ససేమిరా అన్నారు. టిటిడి పదవికి సెంటిమెంటును కలిపి తాను రాజీనామా చేసేది లేదనీ, కావాలంటే తొలగించవచ్చనీ సవాలు విసిరారు.
ఈ రోజు మంత్రివర్గం ఏర్పడింది కాబట్టి 10వ తేదీన జరిగే మొదటి మంత్రివర్గ సమావేశంలో పాలకమండలులకు మంగళం పాడే ఆర్డినెన్స్ను ఆమోదించాలని అధికారపక్షం భావిస్తున్నది. టిటిడి ట్రస్టుబోర్డు అధ్యక్షపదవికి వైవి సుబ్బారెడ్డి పేరును ముఖ్యమంత్రి ఇప్పటికే ఖరారు చేశారు. కొత్తగా నియమించబోయే బోర్డులో తెలంగాణ ప్రతినిధులుగా టిఆర్ఎస్ నాయకత్వం సూచించిన వారిని ఇద్దరిని తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెలంగాణకు టిటిడి ట్రస్టు బోర్డులో ప్రాతినిధ్యం ఇచ్చింది. అయితే తెలంగాణలో కూడా టిడిపి శాఖ ఉంది కాబట్టి ఆ పార్టీకి చెందిన వారిని చంద్రబాబు నాయుడు బోర్డుకు నామినేట్ చేశారు. ఇప్పుడు పొరుగు రాష్ట్ర ప్రభుత్వంతో స్నేహసంబంధాలతో కలిసి నడుద్దామని అనుకుంటున్న జగన్ సుహృద్భావ సూచికగా టిఆర్ఎస్ చెప్పిన వారిని ఇద్దరిని నామినేట్ చేయాలని భావిస్తున్నారు.