అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిర్ణాయక శక్తిగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పావులు కదపడం మొదలయ్యింది. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు తెర లేపింది. జనసేన పార్టీ నుంచి పత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన రావెల కిషోర్ బాబు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానన్న రావెల ఆ తర్వాత వెళ్లి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ఆయన రేపు తిరుపతిలో నరేంద్ర మోదీ సమక్షంలో బిజెపిలో చేరతారని చెబుతున్నారు.
రాష్ట్రంలో టిడిపి నుంచి వలసలు ప్రోత్సహించి ఆ పార్టీని బలహీనపరచడం బిజెపి వ్యూహంగా కనబడుతోంది. శాసనసభ ఎన్నికలలో పార్టీని ఘోర పరాజయం వైపు నడిపించిన చంద్రబాబు నాయుడు బిజెపి, వైసిపి కలిసి చేసే దాడిని ఎదుర్కొనలేరనీ, అది ద్వితీయ శ్రేణి నాయకులలో అభద్రతకు దారి తీస్తుందనీ బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు కొంతమందిని పార్టీలోకి ఆకర్షించగలిగితే ఇక అందరూ వరస కడతారని వారు ఆశిస్తున్నారని చెబుతున్నారు.
క్రమంగా టిడిపిని బలహీనపరచి దాని స్థానంలో తాము బలమైన ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నది బిజెపి వ్యూహంగా కనబడుతోంది. ఒకసారి ఆ దశకు చేరిన తర్వాత అప్పుడు వైసిపి సంగతి చూడవచ్చుననీ, సిబిఐ, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ తమను గట్టిగా ప్రతిఘటించలేరనీ బిజెపి నమ్ముతున్నట్లు కనబడుతోంది.
ఈ వ్యూహంలో భాగంగా టిడిపికి చెందిన పలువురు నాయకులతో బిజెపి టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బిజెపి వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. పత్తిపాటి ఈ వార్తలను ఖండించారు కూడా.
మరోపక్క అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ కూడా బిజెపిలో చేరడానికి సంసిద్ధులవుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు ప్రకటించిన జెసి దివాకర్ రెడ్డి కుటుంబం కూడా బిజెపి పంచన చేరడానికి రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకూ బిజెపికి పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయన్నది మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది.