శ్రీకాకుళం కరోనా కథ – ఇంతింత కాదయా ..!
గత కొద్ది రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలే ఒక్క కేసు కూడా లేకుండా గ్రీన్ జోన్ లో ఉన్నాయి. వాటిని చూసి మిగతా జిల్లా ప్రజలు కూడా త్వరలోనే తాము కరోనా ని నియంత్రించి ఆ జాబితాలోకి వెళ్ళిపోదామని ఆశగా కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో మొన్న నాలుగు కరోనా కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రజలంతా అవాక్కయ్యారు. ఆ నాలుగు కేసులు కి కారణం ఒకడే. ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి జిల్లాకు రాగా మిగిలిన వారికి కూడా అంటించాడు. తాజాగా ఇప్పుడు జిల్లాలో మరో కరోనా కేసు నమోదు కాగా ఇంతకుముందు వచ్చిన నాలుగు కేసులకు మరియు ఇప్పుడు వచ్చిన ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. దీనితో ఆశ్చర్యపోవడం అధికారుల వంతు అయింది. విషయం ఏమిటని ఆరా తీస్తే శ్రీకాకుళం జిల్లా పి ఎస్ కాలనీకి చెందిన ఈ విద్యార్థి ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. లాక్ డౌన్ కన్నా ముందే ఇంటికి చేరుకున్న కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించడం గమనార్హం. అయితే ఇప్పుడు అతనికి పాజిటివ్ వచ్చింది. ఢిల్లీ మర్కజ్ కు హాజరైన వ్యక్తులతో ట్రైన్ ప్రయాణం చేసి ఉండటం వల్ల ఇతనికి కరోనా వచ్చి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఇతను అధికారులకు సమాచారం ఇచ్చి క్వారంటైన్ కు వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఏదైనా చాలా అనూహ్యరీతిలో ఒక్కసారిగా ఈ జిల్లాలో ఐదు కేసులు రావడం ఇప్పుడు అందరిలో కలకలం రేపుతోంది. అదీ కాకుండా ఇప్పుడు నమోదైన తాజా కేసు శ్రీకాకుళం టౌన్ లో మొదటిది. ఇంతకుముందు నమోదైన 4 కేసులు పాతపట్నం ప్రాంతానికి చెందినవి. ప్రస్తుతం సదరు విద్యార్థి, టౌన్ లో ఏఏ ప్రాంతాల్లో తిరిగాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు.. అతడు నివశిస్తున్న పీఎన్ కాలనీని పూర్తిగా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి పోలీసులు-అధికారులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు....