అమరావతి: సబ్ కాంట్రాక్టుల ముసుగులో టిడిపి ప్రభుత్వం తమకు నచ్చిన వారిని తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారనీ, అక్కడ పెద్ద ఎత్తున స్కామ్లు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు. పది పదిహేను రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినపుడు బండారం బయటపడుతుందని జగన్ పేర్కొన్నారు.
శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నపై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. జలవనరుల శాఖ మంత్రి మంత్రి అనిల్ కుమార్ చెప్పిన సమాధానంపై సంతృప్తి చెందని టిడిపి సభ్యులు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు.
ప్రశ్నోత్తరాల సమయంలో డిబేట్ సాధ్యపడదని, వేరే ఫామ్లోవస్తే చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొని ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తుండగా టిడిపి సభ్యులు నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికార పక్షం పేర్కొంది.
ఈ సందర్భంలో సిఎం జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిందనీ, దీనిపై తాము నిపుణుల కమిటీని నియమించామని చెప్పారు. తనకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం రివర్స్ టెండరింగ్ విధానానికి వెళితే కనీసం 15నుండి 20 శాతం అంటే సుమారు 15వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి కూడా పోలవరంలో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని జగన్ ఆరోపించారు.పెంచిన రేట్లతో ఆయన పనులు చేస్తున్నాడని జగన్ పేర్కొన్నారు. స్పిల్ వే పనులు పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారని జగన్ అన్నారు. కాఫర్ డ్యామ్ వల్ల గోదావరి వెడల్పు 70శాతం తగ్గిపోయిందని జగన్ చెప్పారు.
‘జెన్కో సంబంధించిందిన పనులు తమకు కావాల్సిన నవయుగ కంపెనీకి ఇచ్చారు, ఇంత వరకూ డిజైన్లు ఫైనలైజ్ కాలేదు. వారు పనులు ప్రారంభించలేదు, ఒక్కఇటుక పని కూడా చేయలేదు కానీ 724కోట్ల రూపాయలు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు’ అని జగన్ ఆరోపించారు. ఏ స్థాయిలో పోలవరం ప్రాజెక్టను వీరు దోచేశారో పది పదిహేను రోజుల్లో బయటకు వస్తుందని జగన్ అన్నారు. నిపుణుల కమిటి నుండి త్వరలో నివేదిక వస్తుందని జగన్ పేర్కొన్నారు.
ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ ఒకటి నుండి పనులు మొదలు పెట్టాలనీ సూచించామనీ, 2021 జూన్ నాటికి నీళ్లు ఇవ్వాలన్నది తమ లక్ష్యమని జగన్ పేర్కొన్నారు. మూడు రోజులుగా మంత్రి వివరణ ఇస్తున్నా చంద్రబాబు దుర్బుద్ధితో రాద్ధాంతం చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు.