అమరావతి: టిడిపి అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్ధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను టిటిపి అధినేత చంద్రబాబు తప్పుబట్టిన విషయం తెలిసిందే. జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సహజ సిద్ధమైన సముద్రతీర నగరం విశాఖను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం అని కితాబు ఇచ్చారు.
రోడ్, రైల్, ఎయిర్ కనెక్టివిటీతో రాజధానిగా అందరి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే నగరంగా విశాఖ మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రంగా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయమనీ, అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారనీ గంటా పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా గంటా వైసిపిలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఊహగానాలకు తగినట్లుగానే అసెంబ్లీ సమావేశాల్లోనూ గంటా టిడిపి పక్షాన చురుగ్గా పాల్గొన్న దాఖలాలు లేవు. వీటికి తోడు రాజధానుల ప్రకటనపై జగన్మోహనరెడ్డి నిర్ణయానికి బాహాటంగా మద్దతు పలకడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.