(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు ఆదివారం విచారణ జరిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. మహిళలపై లాఠీ ఛార్జి, దాడి ఘటనలకు సంబంధించి తుళ్లూరు తహసీల్దార్, డిఎస్పితో కమిషన్ సభ్యులు కాంచన కట్టర్, ప్రవీణ్ సింగ్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తొలుత తుళ్లూరు గ్రామానికి చేరుకునే ముందు మార్గ మధ్యంలో మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు.
తుళ్లూరులో పెద్ద సంఖ్యలో మహిళలు పోలీసుల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను మహిళా కమిషన్ సభ్యులకు వివరించారు. పోలీసులు ఏ విధంగా హింసించిందీ మహిళలు కమిషన్ ఎదుట ఏకరువు పెట్టారు.
దాడి ఘటనకు సంబంధించి సెల్ఫోన్లో చిత్రీకరించిన కొన్ని దృశ్యాలను కమిషన్ సభ్యులకు చూపించారు. ఉదయం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన మహిళలను రాత్రి 9.00 గంటలకు విడిచిపెట్టారని తెలిపారు. అర్థరాత్రి రెండు గంటలకు సివిల్ డ్రసులో ఇళ్లలోకి పోలీసులు వచ్చారనీ ఆ దృశ్యాలు సిసి కెమెరాలోనూ రికార్డు అయ్యాయని మహిళలు తెలియజేశారు. గ్రామంలోని దేవస్థానాలకు తాళాలు వేశారనీ, కావాలంటే స్వయంగా చూడవచ్చు అనీ మహిళలు కమిషన్ సభ్యులకు తెలియజేశారు. కమిషన్ సభ్యులకు సమయం మించిపోవడంతో మందడం గ్రామానికి వెళ్లలేదనీ, పోలీసుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మి అనే మహిళను పరామర్శించి ఆమె వద్ద నుండి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లారనీ గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ తెలిపారు. పోలీసుల దాడిపై రైతులు, మహిళలు చెప్పిందంతా నమోదు చేసుకున్నారనీ చెప్పారు. మహిళలపై పోలీసుల దాడికి సంబంధించిన అధారాలు అన్నీ కమిషన్కు ఇచ్చామని తెలిపారు. మహిళా కమిషన్ సభ్యులు ఢిల్లీ వెళ్లిన తరువాత పూర్తి నివేదిక రూపొందిస్తారని అన్నారు. కమిషన్ నివేదిక రైతులకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30ని తొలగించాలని జయదేవ్ డిమాండ్ చేశారు.