(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న కేరళ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. సీఏఏ చట్టం రాజ్యాంగంలోని సమానత్వ హక్కుతో పాటు పలు ఆర్టికల్స్ను ఉల్లంఘిస్తోందని కేరళ ప్రభుత్వం ఆ పిటిషన్ లో పేర్కొంది. రాజ్యాంగంలో ప్రాథమికంగా పేర్కొనే సెక్యులరిజమ్కు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని ఆరోపించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో ఇప్పటి వరకు మొత్తం 60 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంకా కొన్ని ప్రదేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని ఇప్పటికే కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి.. ఆమోదించారు. సీఏఏ రద్దు తీర్మానాన్ని ఆమోదించేందుకు కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీని సమావేశం నిర్వహించింది. ఈ తీర్మానాన్ని అధికార సీపీఐ (ఎం)-ఎల్డీఎఫ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సమర్థించాయి. అయితే బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ మాత్రమే దీన్ని వ్యతిరేకించారు.
పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని అమలు చేయబోమని కేరళతోపాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. అసోంలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారని, ఇది రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదం, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు, బిల్లును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు అంటున్నాయి.
కాగా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్ లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి గతేడాది డిసెంబర్ లో పార్లమెంటు ఆమోదం తెలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సి), జాతీయ జనాభా జాబితా (ఎన్పిఆర్)లను నిరసిస్తూ… దేశ వ్యాప్తంగా ముస్లిములు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.