(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై బహిరంగ చర్చకు రావాలన్న హోంమంత్రి అమిత్ షా సవాలును అందరికన్నా ముందు బిఎస్పి నేత మాయావతి స్వీకరించారు. ఎక్కడైనా ఏ వేదికపైనయినా చర్చకు తమ పార్టీ సిద్ధమేనని ఆమె బుధవారం ట్వీట్ చేశారు.
आति-विवादित CAA/NRC/NPR के खिलाफ पूरे देश में खासकर युवा व महिलाओं के संगठित होकर संघर्ष व आन्दोलित हो जाने से परेशान केन्द्र सरकार द्वारा लखनऊ की रैली में विपक्ष को इस मुद्दे पर बहस करने की चुनौती को BSP किसी भी मंच पर व कहीं भी स्वीकार करने को तैयार है।
— Mayawati (@Mayawati) January 22, 2020
మంగళవారం లక్నోలో ఒక బహిరంగ సభలో ప్రసంగించిన హోంమంత్రి, సిఎఎపై ప్రతిపక్షాలు అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఎవరి పౌరసత్వాన్నయినా గానీ రద్దు చేసే నిబంధన సిఎఎలోనే లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాల్సిందిగా ఆయన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, మాయావతికి ప్రత్యేకంగా సవాలు విసిరారు.
ఆ నలుగురిలో ఈ సవాలును మాయావతి ముందు స్వీకరించారు. అయితే అమిత్ షా లక్నో ప్రసంగం తర్వాత అందరికన్నా ముందు మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. వేరేవారితో ఎందుకు, నాతో చర్చకు రండి. ఈ గడ్డం వాడితో చర్చించండి అంటూ ఆయన అమిత్ షాకు ప్రతి సవాలు విసిరారు.
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన సిఎఎను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పొరుగు దేశాల నుంచి వచ్చే వలసదారులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం మతాన్ని ప్రాతిపదికగా పరిగణిస్తున్నది. హిందువులు, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, క్రిష్టియన్లు, జైనులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ చట్టం పరిధి నుంచి ముస్లింలను మినహాయించారు. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని ప్రతిపక్షాలూ, పౌర సంఘాలూ వాదిస్తున్నాయి.
సిఎఎను సవాలు చేస్తూ దాఖలయిన 143 పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది. జవాబు దాఖలు చేసేందుకు కేంద్రప్రభుత్వానికి కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ పిటిషన్లను విచారించేందుకు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రదాన న్యాయమూర్తి తెలిపారు.