అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనపై ఆందోళన చేస్తున్న అమరావతి రైతలు దీనిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీకి రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో లేఖలు రాశారు. రాజధాని విషయంలో అన్యాయం జరిగిందని.. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం, ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ మూడు పేజీల లేఖల్ని రాశారు. సీఆర్డీఏ యాక్ట్, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను తమ లేఖల్లో ప్రస్తావించారు. రాజధాని గ్రామాల్లో నిర్మాణాలు, పెట్టిన ఖర్చు వివరాలను కూడా పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోదీ చేతులమీదగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను కూడా లేఖకు జోడించి రాజధాని రైతులు మోదీకి పంపించారు. ఏపీకి మూడు రాజధానులు నిర్ణయంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పెద్ద సంఖ్యలో లేఖలను ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు. అయితే, రైతుల లేఖలపై కేంద్రం స్పందిస్తుందా? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు మూడు రాజధానుల ప్రకటనపై గత వారం రోజులుగా అమరావతిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించింది. అమరావతిలో మూడు రాజధానుల ప్రకటనపై రోజుకో రూపంలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలకు దిగుతున్నారు. వీరికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి.