అమరావతి: చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్థావనకు వచ్చింది. వైసిపి సభ్యుడు కాకాని గోవర్థన్ రెడ్డి చంద్రబాబు విదేశీ పర్యటన విషయాన్ని ప్రస్థావించడంతో ఈ చర్చకు దారి తీసింది. చంద్రబాబుతో పాటు నాటి మంత్రుల పర్యటనపై కూడా మంత్రివర్గ ఉప సంఘం పరిశీలన చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు.
అనుబంధన ప్రశ్నల సమయంలో వైసిపి సభ్యుడు గోవర్థన్ రెడ్డి చంద్రబాబు విదేశీ పర్యటనలపై విమర్శలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసమే విదేశీ పర్యటనలు చేశాను తప్ప సొంత ప్రయోజనాల కోసం కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు వివరణ ఇచ్చారు.
మాట్లాడితే 40ఏళ్ల అనుభవం అని చెప్పే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రానికి ఏమి ఒరగబెట్టారో చెప్పాలని గోవర్థన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారం ఆయన విదేశీ పర్యటనలకు పనికి వచ్చిందేమో గానీ, రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీలేదని గోవర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చుభారం మాత్రం ప్రజలపై పడిందన్నారు. ఏపికి ఐటి సంస్థలు వస్తున్నాయంటూ నిరుద్యోగ యువతను మోసం చేశారనీ గోవర్థన్ రెడ్డి విమర్శించారు.
దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి సమాధానం ఇస్తూ మంత్రివర్గ ఉప సంఘం పరిధిలో చంద్రబాబు, నాటి మంత్రుల విదేశీ పర్యటనల వివరాలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. 39కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందనీ దీనిపై లోతైన దర్యాప్తు జరగాలని వైసిపి సభ్యుడు గోవర్థన్ రెడ్డి అన్నారు.
వైసిపి సభ్యుల ఆరోపణలపై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే తాను విదేశీ పర్యటనలు చేపట్టానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డానని చంద్రబాబు పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం కూడా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు యత్నించాలి కానీ వృధా ఖర్చు అంటూ విమర్శించడం సరికాదని చంద్రబాబు అన్నారు. తాము చేసిన ప్రయత్నాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయనీ ఐదు లక్షల మందికి ఉపాధి దొరికిందని చంద్రబాబు చెప్పారు. విదేశీ పర్యటనల్లో 16లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చంద్రబాబు అన్నారు.
తనపై విమర్శలు మానుకొని వారు తమ వెనుక ఉన్నవి చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసం తామేంచేస్తారో చెప్పాలని అధికార పక్షాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని మోది కూడా చాలా దేశాల్లో పర్యటించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపిని నెంబర్ వన్ స్థానానికి చేర్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతిదానికి తనపై విచారణ జరిపించాలని అనుకోవడం మంచిపద్ధతి కాదని చంద్రబాబు అన్నారు.