అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది.
వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి ఎనిమిది తరగతుల బోధనను పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేయడం పట్ల తెలుగు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో చదువుకునే విషయమై పిల్లలు, వారి తల్లిదండ్రులు తమకు ఏది కావాలో ఎంచుకునే అవకాశం లేకుండా చేయడం ఏమిటని భాషావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వివిధ రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించి విడుదల చేసిన జివో 81ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు మాతృభాషగా ఉన్న రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేకపోవడం అన్యాయమని రాష్ట్రోపధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సుధీర్ బాబు, నాగేశ్వరరావు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆంగ్లప్రదేశ్గా మార్చే ప్రభుత్వ నిర్ణయం సరికాదని వారు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొంటున్నారు. ఒక వైపు ప్రభుత్వ కార్యకలాపాల ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తున్న తరుణంలో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేయడం సరికాదని ఆయన
అన్నారు. ఏ మీడియంలో చదవాలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇష్టానికి వదిలివేయాలని మాజీ హోంశాఖ మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప అంటున్నారు.
వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు, ప్రముఖుల నుండి దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సిఎం జగన్మోహనరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.