(న్యూస్ అర్బిట్ బ్యూరో)
అమరావతి: పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. నవయుగ సంస్థ దాఖలు చేసిన అప్పీలులో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవయుగ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేసి రివర్స్ టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. దానితో
హైడల్ ప్రాజెక్ట్ విషయంలో ఒప్పందాన్ని ఏపీజెన్కో ఏకపక్షంగా రద్దు చేసుకుందని నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. తొలుత స్టే ఇచ్చిన సింగిల్ జడ్జి బెంచ్ తర్వాత స్టే ఎత్తివేయడంతో ప్రభుత్వం వెంటనే మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పనులు కట్టబెడుతూ ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది. మేఘా సంస్థ ఆ వెంటనే పోలవరం ప్రాజెక్టు సైటు వద్ద భూమి పూజ నిర్వహించి పనులు మొదలుపెట్టింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నవయుగ సంస్థ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు అప్పీలుకు వెళ్లింది. ఈ అప్పీలుపై విచారణ చేపట్టిన ధర్మాసనం, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ పనులు కొనసాగించరాదంటూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
కొద్ది రోజుల క్రితమే జగన్ సర్కార్ పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి రివర్స్ టెండరింగ్ చేపట్టింది. ఈ పద్దతి ద్వారా 850 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.