అమరావతి: శాసన మండలి సాక్షిగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు అమరావతి నుండి రాజధాని మార్పు ప్రతిపాదన ఏమీ లేదంటూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
శాసనమండలి సమావేశాల్లో అయిదవ రోజైన శుక్రవారం అమరావతి రాజధానికి సంబంధించి టిడిపి సభ్యులు పామిడి శమంతకమణి, గనపాటి దీపక్ రెడ్డి, పరుచూరి అశోక్బాబులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరి ప్రశ్నలకు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అమరావతి నుండి రాష్ట్ర రాజధానిని మార్చేందుకు ఏదైనా ప్రతిపాదన ఉన్నదా అన్న ప్రశ్నకు లేదండీ అనీ సమాధానం ఇచ్చారు. అదే విధంగా రాజధాని మార్పు ప్రతిపాదన ఉంటే అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకూ ఖర్చు చేసిన నిధుల వివరములు ఏమి, రాష్ట్ర రాజధాని మార్పు వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమి అన్న ప్రశ్నలకు ఈ ప్రశ్నలు ఉత్పన్నం కాదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పటి వరకూ వెలువడిన ఊహాగానాలకు తెరపడినట్లు అవుతున్నది.