(న్యూస్ అర్బిట్ బ్యూరో)
ముంబై: తమ నిర్వాకం ఎక్కడ బయటపడుతుందోనని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భయపడినందువల్లనే భీమా కోరేగావ్ కేసు దర్యాప్తును హఠాత్తుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం కోసం ప్రశ్నించేవారిపై బిజెపి అర్బన్ నక్సల్స్ అన్న ముద్ర వేస్తున్నదని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు.
భీమా కోరేగావ్ కేసును మహారాష్ట్రలోని శివసేన-ఎన్సిపి-కాంగ్రెస్ ప్రభుత్వం పునసమీక్షిస్తున్నదని తెలియగానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దానిని ఎన్ఐఎకు అప్పగించింది. ఎన్ఐఎ చట్టం ప్రకారం సంబంధిత రాష్ట్రం అనుమతి లేకుండానే కేంద్ర దర్యాప్తు సంస్థ కేసును చేపట్టవచ్చు.
శరద్ పవార్తో పాటు కాంగ్రెస్ కూడా బిజెపి ప్రభుత్వ చర్యను విమర్శించింది. ప్రదాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా విద్వేష రాజకీయీలను వ్యతిరేకించేవారందరిపై అర్బన్ నక్సల్స్ ముద్ర వేస్తున్నారని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేసారు.
Anyone who opposes the MOSH agenda of hate is an “Urban Naxal”.
Bhima-Koregaon is a symbol of resistance that the Government’s NIA stooges can never erase. https://t.co/vIMUSs2pjL
— Rahul Gandhi (@RahulGandhi) January 25, 2020
హింసాత్మకంగా పరిణమించిన భీమా కోరేగావ్ ఆందోళనను ప్రేరేపించారన్న అభియోగంపై పూనా పోలీసులు న్యాయేవాదులపై, మానవ హక్కుల కార్యకర్తలపై కేసు పెట్టారు. దీనికి సంబంధించి తొమ్మిది మంది నిందితులు 2018 జూన్ నుంచి జైలులో మగ్గుతున్నారు. ప్రొఫసర్ ఆనంద్ తేల్తుంబ్డె, గౌతమ్ నవలఖా వంటి మరికొందరు కూడా ఈ కేసులో నిందితులు. అయితే కోర్టులు అడ్డుకోవడం వల్ల వారిని ఇంకా అరెస్టు చేయలేదు.
విప్లవ కవి వరవర రావు, దళిత హక్కుల కార్యకర్త సుధీర్ దవాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, గడ్చిరోలికి చెందిన కార్యకర్త మహేష్ రౌత్, నాగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షోమా సేన్, ఖైదీల హక్కుల కార్యకర్త రోమా విల్సన్, న్యాయవాదులు సుధా భరద్వాజ్, అరుణ్ పెరీరా, వెర్నోన్ గంజాల్వెస్ అండర్ ట్రయిల్స్గా ఖైదులో ఉన్నారు.
భీమా కోరేగావ్ హింసకు సంబంధించి హిందుత్వ నాయకులు మిలింద్ ఎగ్బోటే శంబాజీ భిడేపై కూడా పూనా పోలీసులు కేసు పెట్టారు. వారిలో ఎగ్బోటేను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. భిడేను ఇంతవరకూ అరెస్టే చేయలేదు.