బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగింది. ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల, ఇతరులు ఓ స్థానంలో గెలిచారు. ఎన్నికల ఫలితాలపై సీఎం యడియూరప్ప సంతోషం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఏర్పడిన తన ప్రభుత్వానికి ప్రజల మద్దతు గట్టిగా ఉందని, ప్రజలు చాలా మంచి తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వం కోసం, తన పరిపాలన తీరును చూసి ఓట్లు వేశారన్నారు. ఇకపై ఎటువంటి సమస్య లేకుండా తాము ప్రజానుకూలంగా, సుస్థిర ప్రభుత్వాన్ని అందజేస్తామని చెప్పారు.
అయితే, ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఓటమిని అంగీకరిస్తున్నామని..ప్రజల తీర్పుకు కట్టుబడి ఉంటామని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అన్నారు. ఫిరాయింపుదారులను ప్రజలు మద్దతు తెలిపారని, అందుకు తాము బాధపడాల్సినవసరం లేదని చెప్పారు.
ఎల్లాపూర్, రనెబెన్నూర్, విజయనగర, మహాలక్ష్మి లేఅవుట్, చిక్కబల్లూపుర, కే ఆర్ పుర, కే ఆర్ పేటె, అథని, గోకక్, హిరేకెరూర్, యశ్వంత్ పుర, కగ్వాడ్ శాసన సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్కు శివాజీనగర, హున్సుర్ స్థానాలు లభించాయి. హోస్కోటే నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
ఇక జేడీఎస్కు ఈ ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ దక్క లేదు. 223 స్థానాలున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 105మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ తిరిగి అధికారం నిలబెట్టుకోవాలంటే మరో ఏడు స్థానాల్లో గెలవాల్సి ఉంది. ఐతే దాదాపు 12 నియోజకవర్గాల్లో కమలనాథులే పాగా వేడయంతో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కొనసాగనుంది.
14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. డిసెంబర్ ఐదో తేదీన రాష్ట్రంలోని 15 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలు అన్ని స్థానాలకు పోటీ చేయగా జేడీఎస్ 12 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. ఎన్నికల్లో 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో కేసులు ఉండటంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. దీంతో అసెంబ్లీలో మిగిలిన 222కు గాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇవాళ వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 12 స్థానాలో విజయం సాధించడంతో ఇప్పుడు ఆపార్టీ బలం 117కి చేరింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.