(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: సంక్రాంతి పండుగ తరువాత అమరావతి రాజధాని ఉద్యమంలోకి బిజెపి ప్రత్యక్షంగా పాల్గొంటుందని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ బిజెపి రంగంలోకి దిగితే ఉద్యమ స్వరూపం మారిపోతుందని అన్నారు. ఇకపై అన్ని ప్రాంతాల్లోని బిజెపి నాయకులది ఒకే మాటగా ఉంటుందని చెప్పారు.
పడగొట్టడం, విడగొట్టడం అనే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసిపి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు చేయడం తగదని అన్నారు. వెల్లంపల్లి వైసిపి గొర్రెల మందలో చేరిన కొత్త గొర్రె అని రమేష్ నాయుడు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు రాజధాని నిర్మాణంలో విఫలం అవ్వగా జగన్మోహనరెడ్డి ముందే చేతులు ఎత్తివేశాడని అన్నారు. వైసిపి ప్రభుత్వానికి చేతకాకపోతే రాజధాని నిర్మాణం బిజెపికి అప్పజెప్పాలని కోరారు. ఇప్పటి వరకూ రాజధానికి 2500 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు వేల కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేస్తూ సహకరిస్తుండగా బిజెపి లక్ష్యంగా వైసిపి మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు.అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఆయన తప్పుబట్టారు. జాతీయ మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించినట్లే ఎస్సి కమిషన్ కూడా అమరావతిలో పర్యటించాలని ఆయన కోరారు.
విశాఖపట్నం సహజ సిద్ధంగా అభివృద్ధి చెందుతోందనీ, ఇప్పటికే ఉక్కు పరిశ్రమ, ఫోర్ట్, ఫార్మాసిటీ, పెట్రో కారిడార్, విశాఖ – చెన్నై కారిడార్లు ఉన్నాయనీ తెలిపారు. రాజధాని అడిగే హక్కు రాయలసీమకు మాత్రమే ఉందని అన్నారు. సీమలో హైకోర్టు, పరిశ్రమలు, తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులు వెంటనే నిర్మించాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు.