అమరావతి: గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఇళ్ల నిర్మాణాలపై జరిగిన చర్చలో టిడిపి సభ్యుల ప్రశ్నలపై మంత్రి బొత్స సమాధానమిచ్చారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేసి ఇవ్వలేదన్నారు. లబ్దిదారులను తొలగించామంటూ వైసిపి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగినందువల్లే రివర్స్ టెండరింగ్కు వెళ్తామని ముందే చెప్పామని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్లో 150 కోట్ల రూపాయలు ఆదా అయ్యిందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ వల్ల ఇంటికి 75వేల రూపాయల వంతున ఆదా అయ్యిందన్నారు.
ముందుగా టిడిపి సభ్యుడు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి లేదనీ, లబ్దిదారులు ఆందోళనలో ఉన్నారనీ అన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే వరకూ పేదలకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున అద్దె చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టిడిపి హయాంలో లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయనా ఈ ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇళ్ల నిర్మాణంపై హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణాల్లో తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.