హైదరాబాద్: టిడిపి మాజీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బిజెపి తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆషాఢమాసం వెళ్లిపోయి శ్రావణ మాసం రావడంతో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచింది. మొన్న మాజీ ఎంపి వివేక్ను పార్టీలో చేర్చుకొని కాషాయ కండువా కప్పారు. 2024 ఎన్నికల నాటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బిజెపిని ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయాలని ఆ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా టిడిపికి రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్శింహులును బిజెపిలో చేరాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్లు మోత్కుపల్లి నివాసానికి వెళ్లి దాదాపు రెండు గంటలకు పైగా చర్చించినట్లు తెలుస్తోంది. బిజెపి ఆహ్వానానికి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఈ నెల 16వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన సందర్భంలో టిడిపి నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.