(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం మందడంలో బంద్ సందర్భంగా రైతులు, పోలీసులు మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రాజధాని గ్రామాల రైతులు నిర్ణయించుకున్నారు. దీంతో ‘మీరు మాకు సహకరించాలంటే.. మీరు మాకు సహకరించాలి’ అంటూ రైతులు, పోలీసులు పరస్పరం కాళ్ళు పట్టుకున్నారు.
మరోవైపు మందడం రైతులు రాజధానిని అమరావతి నుంచి మార్చొద్దంటూ ఆందోళనను ఉధృతం చేశారు. ఇప్పటికే పోలీసులకు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని చేపట్టిన రైతులు ప్రస్తుతం భారీ ర్యాలీ చేపట్టి సీడ్ యాక్సిస్ రహదారిపై బైటాయించారు. అటు మందడం వైపు, ఇటు సీడ్ యాక్సిస్ వైపు ఉన్న రెండు రహదారులను దిగ్బంధించారు. భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా ఉంటే.. మందడం రైతులు, గ్రామస్థులు పోలీసులకు సహాయ నిరాకరణ చేపట్టారు. పోలీసులకు తాగు నీరు సహా ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదని నిర్ణయం తీసుకున్నారు. తమ దుకాణాల ముందు సైతం పోలీసులు కూర్చోవటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. పోలీసు వాహనాలను గ్రామస్థులు అడ్డుకుని తమ గ్రామం మీదుగా వెళ్లటానికి వీల్లేదని రైతులు వెనక్కి పంపేశారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్థులు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక తుళ్లూరు, ఉండవల్లి ప్రాంతాల్లో రైతులు నిరసన ప్రదన్శనలు కొనసాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. కొన్ని చోట్ల టెంట్ వేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రైతులు రోడ్డుపైనే అందోళనను కొనసాగిస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, శుక్రవారం(జనవరి 3) సకల జన సమ్మెలో భాగంగా మందడంలో ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు విచక్షణ మరిచి విరుచుకుపడ్డారు. మహిళలను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. అయితే, ప్రజలు పోలీసు వ్యాన్ను అడ్డుకొని తీవ్ర నిరసన తెలిపారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు మహిళలు వదిలిపెట్టిన విషయం తెలిసిందే.