ముంబై: ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చి.. దేవేంద్ర ఫడ్నవీస్ మూడు రోజుల ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్.. అనంతరం ఏర్పడిన ‘మహావికాస్ ఆఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వంలోనూ ఆదే పదవి దక్కనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, దానిపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత రాలేదు. అజిత్ పవార్ కు ఇచ్చే మంత్రి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అజిత్ పవార్ కు ఆర్థిక మంత్రి పదవి ఇవ్వనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, డిప్యూటీ సీఎం పదవిని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ నేతలైన అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్ లకు పీడబ్ల్యూడీ, విద్యుత్ శాఖలు కేటాయించినట్లు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.
అనేక మలుపులు తిరిగిన మహారాష్ట్రలో నవంబర్ 28న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ ఆఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలైనా ఇంకా మంత్రి పదవుల కేటాయింపులపై స్పష్టత రాలేదు. ఒప్పందంలో భాగంగా శివసేనకు పట్టాణాభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, నీటివనరులు, ఉన్నత విద్య శాఖలు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్సీపీకి కీలకమైన హోం, ఆర్థిక శాఖతోపాటు హౌసింగ్, వైద్య విద్య, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కు రెవెన్యూ, విద్యుత్, ఎక్సైజ్, ప్రాథమిక విద్య, స్త్రీ సంక్షేమ శాఖలు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేకు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలు లేవని సమాచారం.