ముంబై క్లినిక్ లో ఘోరం
ఛేదించిన డీఆర్ఐ వర్గాలు
మలేసియా నుంచి పిండాలు
వాటితోనే ఐవీఎఫ్ / సరోగసీ
ముంబై: మలేషియాకు చెందిన ఒకరిని అరెస్టు చేయడం, క్యాన్ల అందజేత.. ఈ రెండూ కలిసి ముంబైలో సాగుతున్న పిండాల స్మగ్లింగ్ రాకెట్ ను బయటపెట్టాయి. ఐవీఎఫ్ ద్వారా సంతానం లేనివారికి సంతానభాగ్యం కల్పిస్తామనే ఓ అగ్రశ్రేణి ఎంబ్రియాలజిస్టు నడిపే క్లినిక్ పై డీఆర్ఐ వర్గాలు దాడి చేశాయి. ఐవీఎఫ్ శిక్షకురాలు డాక్టర్ గోరల్ గాంధీ ఆస్పత్రిపై మార్చి 16న సోదాలు చేశారు. ఒక రోజు తర్వాత మలేసియాకు చెందిన పార్తీబన్ దురై ముంబై విమానాశ్రయానికి రాగానే అతడిని అరెస్టు చేసి, ఫ్లాస్కు లాంటి క్యాన్ నిండా మానవ పిండాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పత్రిక సంచలన కథనం ప్రచురించింది.
బాంద్రాలో ఉన్న ఇండో నిప్పన్ ఐవీఎఫ్ క్లినిక్ సైంటిఫిక్, ల్యాబ్ డైరెక్టరుగా గాంధీ ఉన్నారు. మలేసియాకు చెందిన దురై తరచు మానవ పిండాలను తరలిస్తాడని, విచారణలో తేలింది. అతడు వాటిని గాంధీ నడిపే ఐవీఎఫ్ క్లినిక్ వద్దకు తెస్తాడు. దురై ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి, అతడిని క్లినిక్ వరకు తీసుకెళ్లి ఉత్తుత్తగా క్యాన్ డెలివరీ చేసినట్లు చూపించి అక్కడ అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను డాక్టర్ గాంధీ ఖండించి, బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఏప్రిల్ 3 వరకు ఆమెపై ఎలాంటి చర్యలు వద్దని కోర్టు ఆదేశించింది. డీఆర్ఐ విచారణకు ఈనెల 22న హాజరు కావాలని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతీ డాంగ్రేలతో కూడిన ధర్మాసనం డాక్టర్ గాంధీని ఆదేశించింది.
ఇలా మానవపిండాల స్మగ్లింగ్ కేసు తమ వద్దకు రావడం ఇదే తొలిసారని డీఆర్ఐ అధికారులు తెలిపారు. ఐవీఎఫ్ కేంద్రంపై దాడి చేసినపుడు అక్కడ స్మగ్లింగుకు సంబంధించిన పత్రాలు దొరికాయని చెప్పారు. దురై ఇలా పిండాలను తీసుకురావడం ఇది ఏడో లేదా ఎనిమిదోసారి. కస్టమ్స్ చట్టాల ప్రకారం మానవపిండాల దిగుమతి నిషేధం. కేవలం పరిశోధనకు మాత్రమే, అదికూడా ఆరోగ్యపరిశోధన శాఖ అనుమతితో తెచ్చుకోవచ్చు. ఇండో నిప్పన్ ఐవీఎఫ్ కేంద్రాన్ని స్థాపించిన గాంధీ.. ఇంతకుముందు రోతుండా సెంటర్ ఫర్ హ్యూమన్ ప్రొడక్షన్ సంస్థలో ల్యాబ్ డైరెక్టర్, ఉపాధ్యక్షురాలిగా 17 ఏళ్ల పాటు ఉండేవారు. అయితే, మురికివాడలకు చెందిన ఓ బాలిక నుంచి అండాలు సేకరించారని రోతుండా సంస్థపై వివాదం చెలరేగింది. దానిపై అంధేరి కోర్టులో కేసు నమోదైంది.
ఇండో నిప్పన్ క్లినిక్ ప్రత్యేకంగా అండాల ఫ్రీజింగ్, పిండాల బదిలీ, సరొగసీ, సెగ్మెంటెడ్ ఐవీఎఫ్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ లాంటివాటిలో పేరు పొందింది. పిండాలను అక్రమంగా దిగుమతి చేసుకోవడం ద్వారానే సరోగసీ మార్కెట్ వర్ధిల్లుతోంది. తమ పిల్లలు భారతీయుల్లా కనిపించకూడదని కూడా కొందరు తల్లిదండ్రులు అడుగుతున్నారు. మలేసియాలో ఇస్లామిక్ చట్టం ఉన్నందున సరొగసీకి అక్కడ అనుమతి లేదు. కానీ మలేసియా జంటలు తమ పిండాలను భారతదేశంలో అక్రమ సరొగసీకి అమ్ముతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పిండాల దిగుమతిని నిషేధించింది. దిగుమతికి తాము నిరభ్యంతర సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదని ఐసీఎంఆర్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపాు. విదేశీయులు భారతదేశంలో ఐవీఎఫ్ చికిత్స ప్రారంభించి, వారి దేశంలో కొనసాగిస్తేనే పిండాల ఎగుమతికి కౌన్సిల్ అనుమతిస్తుంది.
7 నుంచి 8 మంది డీఆర్ఐ అధికారులు నాలుగు గంటల పాటు తమ క్లినిక్ లో సోదాలు చేశారని గాంధీ తరఫు న్యాయవాది సుజయ్ కాంటావాలా అన్నారు. ఆ సమయంలో సీసీటీవీ ఆపేశారని, పత్రాలు తీసుకెళ్లి, అక్కడే ఇన్వెంటరీ చేసినా, కాపీలు ఆమెకు ఇవ్వలేదని చెప్పారు. పోటీదారులు చేసిన కుట్రగానే దీన్ని తాము భావిస్తున్నామన్నారు. డాక్టర్ గాంధీ చెబితేనే దురై పిండాలు తెచ్చాడని అధికారులు చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు.