చిత్తూరు: విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి సమీపంలో, ముఖ్యమంత్రి నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో కృష్ణా పుష్కర ఘాట్లలో సామూహిక మత మార్పిడిలు జరుగుతుంటే వైసిపి ప్రభుత్వానికి కనబడటం లేదా అని జనసేన అధినేత పవన్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి పార్టీకి, ఆ పార్టీ నేతలకు తన మాటలను వక్రీకరించడం అలవాటుగా మారిందని అన్నారు. తన మాటలను వక్రీకరించకుండా అంశాల వారిగా తాను మాట్లాడిన వాటిపైనే స్పందించి వివరణ ఇవ్వాలన్నారు.తాను అడిగిన విషయాలకు జవాబు ఇవ్వకుండా ఏవేవో అందరికీ తెలిసిన విషయాలను మళ్లీ మళ్లీ చెబుతున్నారని పవన్ అన్నారు.
విజయవాడలో జరిగిన సామూహిక మత మార్పిడిలపై ప్రభుత్వం స్పందించి వివరణ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.ఈ మూకుమ్మడి మత మార్పిడిలపై వివరణ ఇవ్వకపోతే వైసిపి ప్రభుత్వమే మత మార్పిడిలను ప్రోత్సహిస్తుందన్న భావన కలుగుతుందన్నారు. ఎవరి ధైర్యం, అండదండలతో సామూహిక మతమార్పిడిలు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఇతర రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. ఓట్లు పోతాయనే భయమా అని ప్రశ్నించారు.
ధర్మాన్ని పాటించే హిందూ సంస్థలను, హిందువులను అవమాన పర్చేలా తాను ఏ వ్యాఖ్యలు చేయలేదని పవన్ వివరణ ఇచ్చారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.
ముందుగా పవన్ కళ్యాణ్, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మూడు దశాబ్దాల క్రితం ఏడుకొండలవాడి సన్నిధిలో ధర్మో రక్షతి రక్షితః అని నేర్చుకున్నాననీ, త్రికరణ శుద్ధిగా నేటికీ దాన్ని పాటిస్తున్నానని చెప్పారు. దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్ధించినట్టు పవన్ తెలిపారు.