గుంటూరు: ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ఆమోదం పొంది కొద్ది గంటలు కూడా గడవక ముందే గుంటూరులో అమానుష ఘటన జరిగింది. గుంటూరులోని రామిరెడ్డి నగర్లో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై ఇంటర్ విద్యార్థి లక్ష్మణరెడ్డి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నగరపాలెం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్లు తెలిసింది. బాధిత బాలికకు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అసెంబ్లీలో ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన కొద్ది సేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.
దిశ హత్యాచారం ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లుకు శుక్రవారం శాసన సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టం- 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019కు ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో అత్యాచారం కేసుపై కోర్టు తీర్పు వస్తుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించారు.