అమరావతి: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కోరారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖ రాశారు.
ప్రధాన మంత్రి ప్రకటించిన పది శాతం అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకు ఇస్తామని గత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారనీ, అయితే ఇప్పటికీ అది అమలు కాలేదనీ ముద్రగడ పేర్కొన్నారు. చంద్రబాబు గ్లోబల్ ప్రచారం చేసుకున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో కాపులకు న్యాయం జరగలేదని ముద్రగడ విమర్శించారు. ఐదు శాతం కాపు రిజర్వేషన్ అమలుకు ఎటువంటి ఆదేశాలు రాలేదని తహశీల్దార్ కార్యాలయాల్లో చెబుతున్నారని ముద్రగడ పేర్కొన్నారు.
చంద్రబాబు మోసపు చర్యలకు విసిగిన మెజారిటీ కాపు సామాజిక వర్గం ఈ రాక్షస పాలన ఎప్పుడు అంతం అవుతుందా, ఈ టిడిపి సముద్రగర్భంలో ఎప్పుడు కలుస్తుందా అని ఎదురుచూసిందని ముద్రగడ అన్నారు.
2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేత నాయకత్వంలోని పార్టీని కాదని మెజరిటీ కాపులు వైసిపికి ఓట్లు వేశారనీ ముద్రగడ గుర్తు చేశారు.
ఆయిదు శాతం రిజర్వేషన్ అమలు త్వరగా పూర్తి చేస్తే చదువుకునే పిల్లలు, ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగ కాపు యువతీ యువకులకు మంచి జరుగుతుందని ముద్రగడ పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి జగన్ న్యాయం చేస్తారని ముద్రగడ ఆశాభావం వ్యక్తం చేశారు.