(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్ 30వ తేదీన మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేరోజు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ నెల రోజుల క్రితం రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి ఉదయానికల్లా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, కుటుంబ సభ్యుల బుజ్జగింపులతో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి తిరిగి సొంత గూటికి చేరారు. ఆ తర్వాత శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి సారథ్యంలో ‘మహా వికాస్ ఆఘాడి’ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి డిప్యూటీ సీఎంగా ఎవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ను ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్లో తీసుకుంటారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అజిత్ పవారే మళ్లీ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్ 30వ తేదీన అజిత్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ సోమవారం సాయంత్రం సమావేశమై డిప్యూటీ సీఎం పదవిపై చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఒక్కరూ కూడా హాజరు కాలేదు. అయితే ఇప్పటికే సీఎం పదవిని దక్కించుకున్న శివసేన కీలకమైన హోంశాఖ, పట్టణాభివృద్ధి శాఖలను దక్కించుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీకి ఆర్థిక శాఖ, గృహ నిర్మాణ శాఖ, కాంగ్రెస్ పార్టీకి రెవెన్యూ శాఖ అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే లాంఛనమే అనుకుంటున్న తరుణంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ను బీజేపీ తనవైపు తిప్పుకుని నవంబర్ 23న కోడికూసిన వేళకే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే, దీనిపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం, కుటుంబ సభ్యుల ఒత్తిడితో అజిత్ మనసు మార్చుకుని ఎన్సీపీ చెంతకు చేరడం, ఫడ్నవీస్ రాజీనామా చేయడం చకచకా జరిగిపోయింది. దీంతో కూటమి తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ కు మళ్లీ డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించాలని ఎన్సీపీలోని ఓ వర్గం కోరుతోంది. నిజానికి, అజిత్ పవార్ బీజేపీవైపు వెళ్లినప్పుడు… ఆయన వెంట ఎమ్మెల్యేలు ఎవ్వరూ వెళ్లలేదు. ఆయన్ని శాసనసభ పక్ష నేతగా తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ, ఆయన తిరిగి రాగానే డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ అదే ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం విశేషం. బీజేపీ నుంచి తిరిగి తన శిబిరానికి వచ్చాక, అజిత్ పవార్ పై ఎలాంటి విముఖతా వ్యక్తం కానీయకుండా శరద్ పవార్ జాగ్రత్తలు పడ్డారని తెలుస్తోంది. మొత్తం మీద అజిత్కు మరోసారి డిప్యూటీ సీఎం పదవి దక్కనుందనే వార్తల నేపథ్యంలో ఆయన వర్గంలో సంబరాలు చేసుకుంటున్నారు.