అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ హైకోర్టు ఎదుట న్యాయవాదుల నిరసనకు దిగారు. హైకోర్టును తరలించొద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. రాయలసీమకు హైకోర్టును తరలించడం వల్ల కొత్త ఉద్యోగాలేమీ రావని లాయర్లు అన్నారు. సీమ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు నెలకొల్పాలని ప్రభుత్వానికి సూచించారు. రెండు బెంచ్ల ఏర్పాటు వల్ల సమయం, వ్యయం పెరుగుతుందని తెలిపారు. బాధితులకు న్యాయం జరగడంలో చాలా ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.
ఏపీ రాజధాని విషయమై జీఎన్ రావు కమిటీ డిసెంబర్ 20న సీఎం జగన్కు నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 13 జిల్లాలను నాలుగు ప్రాంతాలుగా విభజించాలని జీఎన్ రావు కమిటీ పేర్కొంది. తుళ్లూరులోనే అసెంబ్లీ, రాజ్ భవన్ ఉండాలని.. విశాఖలో హైకోర్టు బెంచ్, సెక్రటేరియట్, సీఎం క్యాంపు ఆఫీస్, వేసవి అసెంబ్లీ ఉండాలని తమ నివేదికలో సూచించింది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ నివేదికపై డిసెంబర్ 27న సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ లో చర్చించనున్నారు.
ఇదిఇలా ఉంటే.. మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న అమరావతి రైతులు.. జీఎన్రావు కమిటీ రిపోర్ట్పై ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం, జీఎన్ రావు కమిటీ నివేదికపై వారం రోజులుగా రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. దీక్షలు, ధర్నాలు, రాస్తారోకో, వంటా-వార్పులతో అమరావతి ప్రాంతాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకో రూపంలో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.