న్యూఢిల్లీ: పాకిస్థాన్కి చెందిన కమాండోలు సముద్రమార్గం గుండా గుజరాత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోకి పాక్ కమెండోలు చొరబడేందుకు యత్నిస్తున్నారనే విషయాన్ని ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ నేపథ్యంలో, గుజరాత్ లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మతఘర్షణలు సృష్టించడం లేదా ఉగ్రదాడులు చేసేందుకు పాక్ కమాండోలు ప్లానేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అదానీ పోర్ట్స్ సెజ్ హెచ్చరిక ప్రకటన జారీ చేసింది. గల్ఫ్ ఆఫ్ కచ్ లోకి పాకిస్థాన్ కమెండోలు ప్రవేశించారనే సమాచారం కోస్ట్ గార్డ్ స్టేషన్ నుంచి తమకు వచ్చిందని ప్రకటనలో తెలిపింది. హరామీ నాలా జలాల గుండా వారు ప్రవేశించారని… అండర్ వాటర్ దాడుల్లో వారు శిక్షణ పొందారనే సమాచారం ఉందని వెల్లడించింది. ముంద్రా పోర్టులోని అన్ని నౌకల పట్ల కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాలని సూచించినట్టు తెలిపింది. దీంతో సరిహద్దు భద్రతా సిబ్బంది, తీర ప్రాంత సిబ్బంది అప్రమత్తమయ్యారు. గుజరాత్లోని అన్ని పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించి.. భద్రతను పెంచారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ అంశంలో భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ అంశంలో ఐక్యరాజ్యసమితితో పాటు ప్రపంచ దేశాలు కూడా భారత్ కే మద్దతు పలకడంతో పాకిస్థాన్ ఉడికిపోతోంది. ఏదో విధంగా భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగానే సరిహద్దుల గుండా ఉగ్రవాదులను చొప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.