(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రజల ప్రాధమిక హక్కులపై ఆక్రమంగా ఆంక్షలు విధించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకున్న అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 144 కింద ప్రభుత్వం అక్రమంగా కాలరాయలేదని కోర్టు శుక్రవారం పేర్కొన్నది.
జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత ఆగస్టులో నిర్వీర్యం చేసిన నాటినుంచీ అక్కడ ప్రజల స్వేచ్చపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దాఖలయిన పిటిషన్పై జస్టిస్ ఎన్.వి. రమణ జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ బిఆర్ గవాయ్ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
అన్ని ఆంక్షల ఉత్తర్వులనూ తక్షణం సమీక్షించాల్సిందిగా ధర్మాసనం తరపున తీర్పు రాసిన జస్టిస్ రమణ కేంద్రాన్ని ఆదేశించారు. ఒక ప్రాంతంలో సెక్షన్ 144 విధించాలంటే అక్కడ అందుకు తగిన పరిస్థితులు ఉండాలని కోర్టు పేర్కొన్నది. ఆంక్షల ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలనీ, వాటిని సవాలు చేసే హక్కు ప్రజలకు ఉందనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజల ప్రాధమిక హక్కులపై ఆంక్షలు విధించే అధికారాన్ని ఇష్టానుసారం వినియోగించడం కుదరదని జస్టిస్ రమణ పేర్కొన్నారు.