(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: రాజధాని అమరావతిలో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడంతో మందడంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.
రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో జెఎసి ఆధ్వర్యంలో సకల జనుల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు, మహిళలు, విద్యార్థులు రాజధాని ఇక్కడే కొనసాగించాలంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరులో మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. మందడంలో మహిళల ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనాన్ని వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకుని వాహనం ముందు రోడ్డుపైనే పడుకున్నారు. తీవ్ర నిరసన నేపథ్యంలో పోలీసులు వెనక్కి తగ్గారు. పోలీసులు వ్యాన్ ఎక్కించిన మహిళలను కిందకు దించి వేశారు.