చెన్నై: ద్రవిడ ఉద్యమనేత రామస్వామి పెరియార్పై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ప్రముఖ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ‘తుగ్లక్’ పత్రిక వార్షికోత్సవంలో పెరియార్పై రజనీ చేసిన వ్యాఖ్యలపై ద్రవిడర్ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. రజినీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్ ద్రవిడర్ కళగం కార్యకర్తలు నలుపు రంగు దుస్తులు ధరించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలోనే రజనీ తన ఇంటి బయట మీడియాతో మాట్లాడారు. 1971లో ఏం జరిగిందో తాను చెప్పినదానిపై చర్చ జరుగుతోందని, అప్పుడు ఏం జరిగిందో మ్యాగజైన్లో వచ్చిన కథనాలను బట్టే తాను చెప్పాను అని అన్నారు. తాను సొంతగా ఊహాజనిత విషయాలేవీ చెప్పలేదని తెలిపారు. ‘‘నేను చెప్పినవి నా సొంత మాటలు కాదు. దానిపై మీడియాలో కూడా పలు కథనాలు ప్రచురితం అయ్యాయి. కావాలంటే వాటిని చూపిస్తాను. కాబట్టి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు’’ అని రజినీ కాంత్ పేర్కొన్నారు.
జనవరి 14న చెన్నైలో నిర్వహించిన ‘తుగ్లక్’ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ.. 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు. అప్పట్లో పెరియార్ సీతారాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని ఆరోపించారు. ఇది అప్పట్లో బయటకు రాకుండా అప్పటి ప్రభుత్వం జాగ్రత్త పడిందని, ఈ వార్తను కేవలం ఒకే ఒక్కతమిళ మేగజైన్ ప్రచురించిందని పేర్కొన్నారు. రజనీ వ్యాఖ్యలపై ద్రావిడర్ విడుదలై కళగం(డీవీకే) నేతలు మండిపడ్డారు. పెరియార్ ర్యాలీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్ను కించపరిచిన రజనీకాంత్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్ విడుదలై కళగం అధ్యక్షుడు నెహ్రూదాస్ కోవై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.