(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: కూల్చివేతలతో పాలన మొదలు పెట్టిన జగన్ ప్రభుత్వం కూలిపోకతప్పదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందడుగు వేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర మీద ప్రేమతో వైసిపి విశాఖకు రాజధాని మార్చడం లేదనీ, వారికి సంబందించిన భూములన్నీ విశాఖలో ఉన్నాయన్నారు. వైసిపి నేతల భూములు అమరావతిలో ఉండి ఉంటే రాజధానిని కదిలించే వారు కాదేమో అని వ్యాఖ్యానించారు.
అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామంటేనే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని పవన్ తెలిపారు. అమరావతికి ప్రధాని మోది శంకుస్థాపన చేశారు కాబట్టి తాము గౌరవిస్తామని అన్నారు. ఈ రోజు అమరావతిని మోసం చేసిన వాళ్లు రేపు కడప, విశాఖ, ఇలా అందరినీ మోసం చేస్తారని విమర్శించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేయడంతో వైసిపి వినాశనానికి పునాది పడిందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కూల్చేంత వరకూ నిద్రపోనని అన్నారు.
ఢిల్లీ నుండి తనకు పిలుపు వచ్చిందనీ, తాను వెళుతున్నాననీ చెప్పారు. ఏమి జరుగుతుందో తాను ఇప్పుడు చెప్పననీ, కానీ అద్భుతాలు జరగనున్నాయనీ పవన్ వెల్లడించారు. తన ఢిల్లీ పర్యటనలో అక్కడి పెద్దలకు రాజధాని మార్పుపై అన్ని వివరిస్తానని చెప్పారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ఉండేలా చేస్తానని తెలిపారు. అవకాశవాద రాజకీయాలకు తాను దూరమని స్పష్టం చేశారు. ప్రజలకు మనశ్శాంతిని కలిగించే రాజకీయాలనే చేస్తానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.