అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక నిదర్శనమని ఏపి అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో టిడిపి నేతల బృందం బుధవారం అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అమరావతిపై తప్పుగా మాట్లాడినట్లు మంత్రి బొత్స ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. రాజధానిలో ఒక్క రాయి కూడా వేయలేదంటూ అవాస్తవాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడు అన్నారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక్కడ 12 టవర్లతో 288 క్వార్టర్స్ నిర్మాణం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. రాజధానిపై వైసిపి నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనీ, ఇక్కడికి వస్తే ఎన్ని భవనాలు ఉన్నాయో వాళ్లకు చూపిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు. ఢిల్లీకి వెళ్ళి టిడిపి పనులు చేసింది డబ్బులిమ్మని జగన్ అడుక్కుంటున్నాడని అచ్చెన్నాయుడు విమర్శించారు.
అమరావతి పేరు చెబితే చంద్రబాబు గుర్తొస్తారని వైసిపి నేతలకు తెలుసని అందుకే రాజధానిని నీరుగార్చే పనిలో పడ్డారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పేదలకు అయిదు వేల గృహాలు నిర్మిస్తే అసలు గృహాలే ఇవ్వలేదని బొత్స చెప్పడం విడ్డూరంగా ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.
టిడిపి ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ రాజధాని పదేళ్లు హైదరాబాదులోనే ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని చంద్రబాబు అమరావతికి తీసుకొచ్చారని అన్నారు. అన్ని జిల్లాలకు యాక్సిస్ ఉంటుందని అమరావతిని రాజధానిగా నిర్ధారించామని ఆయన పేర్కొన్నారు. నదీపరీవాహక ప్రాంతంలో రాజధాని కడితే చాలా సుందరమైన సిటీ అవుతుందని జయదేవ్ అన్నారు. చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీతో పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని జయదేవ్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక రావలసిన నిధులు వెనక్కి పోయాయనీ, రాష్ట్రానికి అప్పు ఇస్తామన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారనీ జయదేవ్ అన్నారు.
చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను నమ్మి, 35వేల ఎకరా భూమి రైతులు ఇచ్చారనీ, రైతులందరూ ఇప్పుడు ఏమవ్వాలని జయదేవ్ ప్రశ్నించారు. ఐఎఎస్ల క్వార్టర్ల నిర్మాణం లక్ష యాభైవేల చదరపు గజాల నిర్మాణం పూర్తి అయ్యిందని జయదేవ్ వివరించారు.
జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం విషయంలో అమరావతి పేరు అసలు పలకలేదనీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి అవసరం ఉందని ఆయనకు తెలియదా అని జయదేవ్ ప్రశ్నించారు.