ఢిల్లీ: తెలంగాణ కీలక నాయకుడు, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ కాషాయ కండువా కప్పుకున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నడ్డా ఆయనకు బీజేపీ సభ్యత్వ రశీదు అందజేశారు. ఆయన వెంట తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు తదితరులున్నారు.
మోత్కుపల్లి 2019 నవంబర్ 4నే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. నాటి నుంచి పార్టీ నేతలతో టచ్లో ఉన్నారు. అయితే.. అధికారికంగా పార్టీలో మాత్రం చేరలేదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరడానికి ఇదే అనువైన సమయంగా భావించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్పై ఘాటు విమర్శలు చేసిన వ్యక్తిగా మోత్కుపల్లికి గుర్తింపు ఉంది. ఒక దశలో కేసీఆర్కు దీటైన నేతగా ఆయణ్ని ప్రచారం చేశారు.
టీడీపీలో కీలక నేతగా ఎదిగిన మోత్కుపల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్బై చెప్పారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించడమే కాకుండా.. కేసీఆర్ పనితీరును మెచ్చుకున్నారు. తెలంగాణలో టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనను టీడీపీ నుంచి బహిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్లో చేరతారంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ, కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం బీజేపీలో చేరాలని నిర్ణయించారు.
1982లో ఎన్టీఆర్ నూతనంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో గనులు, విద్యుత్, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా పని చేశారు. 1985,1989, 1994, 1999, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి బహిష్కరణ అనంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఎల్ఎఫ్ మద్దతుతో ఇండిపెండెంట్గా రంగంలోకి దిగారు. అయితే, ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు.