అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో తెలుగు మాథ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల వరద కొనసాగుతోంది. ప్రతిపక్షాల విమర్శలపై సిఎం జగన్ ఎదురుదాడి చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నేతల పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా అని ప్రశ్నించారు. మీ పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుని పైకి రావాలి గానీ పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం అవసరం లేదా అంటూ జగన్ ఎదురుదాడి చేశారు. జగన్ చేసిన విమర్శలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిన సమయంలో సాక్షి పత్రికలో వచ్చిన కథనాలను లోకేష్ ట్యాగ్ చేస్తూ జగన్ విమర్శలను తిప్పికొట్టారు.
‘అయ్యా గజిని వైఎస్ జగన్ గారు మీ పవిత్ర పత్రిక, మీరు గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేశారు గుర్తు లేదా? నగర పాలక పాఠశాలల్లో టిడిపి ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలి అని ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ రోజు మీరు అడ్డుపడ్డారు. ‘ఎందుకింత తెగులు? తెలుగు లెస్సేనా?’ అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ది ఏమయ్యింది’ అని లోకేష్ ప్రశ్నించారు.
‘ఇంగ్లీషు మీడియం వద్దు, తెలుగే ముద్దు’ అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా’ అని ప్రశ్నించారు.
'ఎందుకింత తెగులు?', 'తెలుగు లెస్సేనా?' అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమయ్యింది? జగన్ గారూ! 'ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు' అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా?
— Lokesh Nara (@naralokesh) November 11, 2019