హైదరాబాద్: తెలంగాణలోని 120 మునిసిపాలిటీల్లో 2,647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలు కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. అనంతరం బ్యాలెట్ పేపర్లు లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 134 కౌంటింగ్ కేంద్రాల్లో 2,169 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మునిసిపాలిటీలోని 1, 2 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించి బోణీ కొట్టింది. వరంగల్ రూరల్లో 12, 17 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పరకాల, చెన్నూరు మునిసిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. పరకాలలో 22 వార్డులకు గాను 11 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక చెన్నూర్లో 18 వార్డులకు 7 చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మొత్తం 10 వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.
టీఆర్ఎస్ నుంచి 2,925 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా, కాంగ్రెస్ నుంచి 2,619.. బీజేపీ నుంచి 2,321 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ తరపున 347 మంది, ఏఐఎంఐఎం నుంచి 297 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. సీపీఐ నుంచి 180, సీపీఎం నుంచి 165, ఇతర పార్టీల వారు 284, స్వతంత్రులు 3,760 మంది పోటీ పడుతున్నారు.
మొత్తం 9 కార్పొరేషన్లలో 325 వార్డులు ఉండగా, వీటిలో ఒకటి ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డుల్లో 80 ఏకగ్రీవం అయ్యాయి. బుధవారం(జనవరి 22) జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ల పరిధిలో 58.83 శాతం, పురపాలికల్లో 74.40 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.