ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం దేవంద్ర ఫడ్నవీస్ బలనిరూపణ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న వేళ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను బీజేపీకి చిక్కకుండా హోటళ్లకు తరలించాయి. ఫడ్నవీస్ త్వరలో బలనిరూపణ ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఆయా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ పార్టీ నియమాలను ఉల్లంఘించిన బీజేపీతో చేతులు కలపడం సంచలనం రేపింది. మహారాష్ట్రలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు కూడగట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తుండగా.. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీ నాయకత్వాలు తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. అందులో భాగంగానే మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను వేర్వేరు ప్రాంతాల్లోని హోటళ్లకు తరలించారు.
మరోవైపు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు వారున్న హోటల్ కు ఆపార్టీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే వెళ్లారు. బలనిరూపణ సందర్భంగా ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన, స్వతంత్రులు కలిసి మొత్తం 165 మంది తమకు ఉందని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మొత్తం 288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీకి 11 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉంది. అందువల్ల ఇంకా 29 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అంత మంది అజిత్ పవార్ వర్గం నుంచీ వస్తారా అన్నది తేలాల్సిన ఉంది. అటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మూడూ కలిపి… 144 మంది సభ్యుల బలం ఉంది. కొందరు ఇండిపెండెంట్లు కూడా ఎన్సీపీకి మద్దతు ఇస్తున్నారు. ఎన్సీపీలో రెబెల్స్గా మారి… అజిత్పవార్ వెంట నడిచిన ఎమ్మెల్యేలు… ఇప్పుడు ఆయనతోనే ఉండాలా లేక… ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెంట ఉండాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ అజిత్ పవార్తో ఉంటే… తమపై అనర్హత వేటు వేస్తారేమోనన్న భయం వాళ్లను వెంటాడుతోంది.
మరోవైపు మెజారిటీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తారని పేర్కొంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను ఆదివారం సుప్రీం కోర్టు విచారించింది. ఇవాళ బలపరీక్ష జరిపించాలన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల వాదనలకు సుప్రీం కోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఈ పిటిషన్పై వాదనలు విన్న జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా లతో కూడిన ధర్మాసనం.. దీని విచారణను సోమవారానికి వాయిదా వేసింది. వెంటనే బలనిరూపణ అవసరం లేదన్న సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, ఫడ్నవీస్, అజిత్ పవార్లకు నోటీసులు జారీ చేసింది. గవర్నర్కు ఇచ్చిన మద్దతు లేఖ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. రేపు ఉదయం 10.30 గంటలలోపు మద్దతు లేఖ ఇవ్వాలని సూచించింది. మద్దతు లేఖ సమర్పించిన తర్వాత బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.