ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష ఎదర్కోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశమై బలపరీక్ష జరపనుంది. ప్రొటెం స్పీకర్గా ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ఇప్పటికే ఎన్నికయ్యారు. శనివారం నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం కానుంది. తొలి రోజునే విశ్వాస పరీక్షను నిర్వహించనున్నారు. ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగనుంది. డిసెంబర్ 3లోగా మెజార్టీని నిరూపించుకోవాలని గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఆదేశించిన నేపథ్యంలో ఆయన శనివారం బలపరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీకి 145 స్థానాలు అవసరం. తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని సంకీర్ణ ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది.
మరోవైపు బీజేపీ ఎంపీ ప్రతాప్రావు చికాలికర్తో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బీజేపీతో చేతులు కలిపి మళ్లీ సొంత గూటికి చేరుకున్న అజిత్.. మరోసారి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడతారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతాప్రావుతో భేటీపై అజిత్ పవార్ స్పందించి ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని అంటున్నారు. ప్రతాప్ రావుది వేరే పార్టీ అయినప్పటికీ, తమ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నేటి బలపరీక్షపై ఆయనతో ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు.