(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్టంలోని అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణకు చెకచెకా అడుగులు వేస్తుంది. ఏ నిమిషంలో అయినా పాలన విశాఖకు మారొచ్చంటూ మంత్రులు చెప్పుకొస్తున్నారు. ఈ లోగా విశాఖ మిలీనియం టవర్స్ లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు నేవి అధికారులు అభ్యన్తరం వ్యక్తం చేసినట్లుగా ఓ పత్రికలో, సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఒక వర్గం చేతికి ఆయుధం చిక్కింది. ఈ అంశం వివాదాస్పదం అయ్యేలోగానే నేవి అధికారులు ఈ ప్రచారాన్ని ఖండించారు. సిఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి అమరావతి ప్రాంత ప్రజానీకం నుండి వ్యతిరేకత ఉంది. మిగిలిన జిల్లాల్లో ఎటువంటి స్పందన లేదు. అమరావతి పరిధిలో జరుగుతున్న ఆందోళనలు, ధర్నాలు ఓ వర్గం మీడియా కాస్త ఎక్కువ చేసి చూపుతుంది. దీంతో రాజధాని విషయంలో ఏదో జరుగుతుంది అనే గందరగోళం సగటు రాష్ట్ర వాసిలో ఏర్పడింది. తాజాగా నేవి అధికారుల పేరు చెప్పి తప్పుడు ప్రచారానికి తెరతీయడం కొత్త అంశంగా మారింది.
అయితే దీనిపై నేవి అధికారులు వెంటనే స్పందించారు. తామెలాంటి అభ్యంతరం వ్యక్తం చెయ్యలేదంటూ తూర్పు నౌకాదళం శనివారం ప్రకటన విడుదల చేసింది.
ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని స్పష్టం చేసింది. అయినా.. తాము అభ్యంతరం వ్యక్తం చేశామంటూ కొన్ని పత్రికలు అసత్య కథనాలు రాయడం తగదని పేర్కొంది. దీనితో ఆ పత్రికలో, సోషల్ మీడియాలో వచ్చిన కధనాలు కల్పితాలు అనే విషయం బోధపడింది.