హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం తీవ్ర కలకలం రేపింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని అధ్బుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చిన జీయర్ స్వామి ఆగమ పర్యవేక్షణలో ఆనందసాయి అనే అర్కిటెక్ట్ ఆధ్వర్యంలో యాదాద్రి ఆలయ నగరంగా తీర్చిదిద్దుతున్నారు.
శివరాత్రి తర్వాత రోజు నుండి మొదలయ్యే బ్రహ్మోత్సవాల నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే మూలవిరాట్టు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న గుహలో కూడా కొన్ని నిర్మాణాలు చేశారనీ, ఆలయంలో పని చేసే ఒక శిల్పి మూల విరాట్టును శాంత మూర్తి నుండి ఉగ్రమూర్తిగా చెక్కించినట్లు ఎబిఎన్ ఆంద్రజ్యోతి పేర్కొన్నది. స్వయంభువును చెక్కిన సమయంలో వారు తీసుకున్న సెల్ఫీలు బయట సర్క్యుటేల్ అయ్యాయని తెలిపింది.
మూల విరాట్టు మరింత బాగా కనిపించేలా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో వారు చేసిన పనులు వివాదాస్పదం అయ్యాయి. ఈ విషయాలు వెలుగు లోకి రావడంతో బిజెపి, హింధూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ లక్ష్మీనరసింహాచార్యులు మాత్రం మూల విరాట్టును ఎవరూ ఎప్పుడూ ఉలితో చెక్కలేదని అంటున్నారు. స్వయంభువులకు దశాబ్దాలుగా సింధూరం పూస్తున్నామనీ, ఆ పూత మందంగా పట్టిందనీ, ఆ సింధూరం మాత్రమే తొలగించామనీ చెబుతున్నారు. సింధూరం తొలగించడం వల్ల ఇప్పటి వరకూ శాంతమూర్తిగా దర్శనమిచ్చిన స్వయంభువు కోరలు బయటపడి ఉగ్రరూపంలో కనిపిస్తున్నాడని చెప్పారు. పాత గుడి కంటే ప్రస్తుత ఆలయ నిర్మాణంలో పలు లోపాలు జరిగిన మాట వాస్తవమేననీ, తమ సూచనలు, సలహాలు ఏమాత్రం తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
బేగంపేట టూరిజం ప్లాజాలో దీనిపై చర్చించేందకు వైటిడిఏ అధికారులు సమావేశమవుతున్నారు. ఆలయ ఇఒ, ముగ్గురు ప్రధాన అర్చకులకు సమావేశాలకు రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది, చెన్నై నుండి హుటాహుటిన రావాలంటూ మాజీ స్థపతి సుందర్ రాజన్కు కబురు పంపినట్లు సమాచారం. మూల విరాట్ను చెక్కితే అది ముమ్మాటికీ తప్పేనని ఆగమ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారులు విచారణ చేసి ఏమి తేలుస్తారో వేచి చూడాలి. గతంలోనూ ఆలయ ప్రాంగణంలో కెసిఆర్ చిత్రంతో పాటు టిఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు తదితర రూపాలు చెక్కడం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.