(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి:రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై జిఎన్ రావు కమిటీ నివేదిక తరువాత బోస్టన్ కమిటీ నివేదిక రావాల్సి ఉందన్నారు. వీటిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ పరిశీలన చేసి నివేదిక ఇస్తుందన్నారు. ఈ పరిస్థితిలోనే మనం ఎందుకు ఆందోళన చెందాలో అర్థం కావడం లేదన్నారు. కమిటీ నివేదికలు వచ్చే వరకూ మనమంతా వేచి చూడాలని ఆర్కే అన్నారు.
రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉండి చంద్రబాబు గ్రాఫిక్స్ చూపిస్తూ అన్ని తాత్కాలిక భవనాలనే నిర్మించి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు అమరావతిలో అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకే ఏడాదికి 700 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన వస్తోందని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ చెప్పారన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు మొత్తం పూర్తి కావాలంటే మరో లక్ష 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. దానికి ఇంకెంత వడ్డీ కట్టాల్సి వస్తుందో అంచనా వేయాలన్నారు.
అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టగలిగారా అని అర్కే ప్రశ్నించారు. అమరావతిలో రైతులకు ఇచ్చిన వాగ్దానాల్లో చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగిపోతోందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆర్కే విమర్శించారు. ఈ ప్రభుత్వం త్వరలో అభివృద్ధి చేసి ప్లాట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోంటోందని ఆయన చెప్పారు. రాజకీయ లబ్దికోసం చంద్రబాబు కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడ్డం పెట్టుకుని అమరావతిలో హంగామా సృష్టిస్తున్నారని ఆర్కే ఆరోపించారు. జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.