అమరావతి, ఏప్రిల్ 16: రాష్ట్రంలో శాంతిభద్రలకు క్షీణించాయనీ, గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం హైదరబాద్ రాజ్భవన్లో రాష్ట్రపతి ఇఎస్ఎన్ నరసింహన్ను కలిశారు. ఈ నెల 11న పోలింగ్ రోజు, తరువాత రాష్ట్రంలో జరిగిన అల్లర్లు, వైసిపి సానుభూతిపరులపై జరిగిన దాడులను వివరించారు.రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కారణంగా వైసిపి శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని జగన్మోహనరెడ్డి తెలియజేశారు.
అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులపై సోమవారం తమ పార్టీ ఎంపిల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. అవే విషయాలపై గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు జగన్ తెలిపారు.
రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలపై ఫిర్యాదు అందజేశామని జగన్ అన్నారు. పోలీసు శాఖ, ఇతర శాఖలను ఉపయోగించుకుంటూ టీడీపి అధినేత, ముఖ్యమంత్ర చంద్రబాబు వైసిపి శ్రేణులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ‘స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏకంగా పోలింగ్ బూత్లకు వెళ్లడమే నేరం, పోలింగ్ బూత్లోకి వెళ్లి ఆయన డోర్ లాక్ చేసుకుని తనంతట తానే చొక్క చింపుకొని హడావుడి చేస్తే అతనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు’ అని జగన్ ప్రశ్నించారు. స్పీకర్ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఓటర్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేయవచ్చా, ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు అని జగన్ ప్రశ్నించారు.
గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని ఓటర్ల ఇళ్లమీదకు వెళ్లి దౌర్జన్యం చేసి కొట్టారు. వారిపై ఎందుకు కేసు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. అదే విధంగా వైసిపి ఎమ్మెల్యే శ్రీవాణిని రూమ్లో ఉంచి గడి పెట్టి దాడి చేశారు. వారిపైనా ఎందుకు కేసు నమోదు చేయలేదని జగన్ అడిగారు.
పూతలపట్టులో ఏకంగా ఎస్సి రిజర్వుడ్ అభ్యర్థి బాబును తెలుగు దేశం పార్టీ వారు కొట్టారు. కుట్లు కూడా పడ్డాయి, ఈ రోజుకు కూడా ఆసుపత్రిలో ఉన్నారు. ఆయనపై దాడి చేసిన వారిపై ఎందుకు కేసు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏకంగా తన సామాజిక వర్గానికి చెందిన 40మంది సిఐలను డిఎస్పిలుగా ప్రమోషన్లు ఇచ్చారని జగన్ ఆరోపించారు. ఆ పార్టీకి అనుకూలంగా కొన్ని శాఖల అధికారులు వ్యవహరిస్తుండటం వల్ల శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ అన్నారు.
మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన ఇవిఎంలను ఎన్నికల సంఘం అనుమతి లేకుండా అధికారులు బయటకు తీశారు. స్ట్రాంగ్ రూమ్ డోర్ తెలవాలంటే అభ్యర్థులను పిలవాలి అటువంటిది ఏమీ లేకుండా వారి ఇష్టానుసారం చేస్తున్నారని జగన్ అన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పారా మిలటరీ ఫోర్స్ పెట్టాలనీ, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాలని జగన్ కోరారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నుండి సిసి కెమెరాల లైవ్ ఫీడ్ను కలెక్టర్లకు కాకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కేంద్ర ఎన్నికల సంఘంకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఇవిఎంల భద్రతపై పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరామని జగన్ తెలిపారు.
చంద్రబాబు తాన హయాంలో జరిగిన స్కామ్లకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ..సచివాలయంలో ఆయన అజమాయిషీ లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని గవర్నర్ను కోరినట్లు జగన్ తెలిపారు.
తాను ఏవరికి వేశానో తెలియని పరిస్థతి ఉందని చంద్రబాబు అనడం హస్యాస్పదంగా ఉందని జగన్ అన్నారు. అన్ని పార్టీల ఏజంట్ల సమక్షంలోనే మాక్ పోలింగ్ జరిగిన తరువాత పోలింగ్ ప్రారంభం అవుతుందనీ, ఏజంట్లు వెరిఫై చేశామని సంతకాలు కూడా చేస్తారని జగన్ తెలిపారు. ఇప్పడు చంద్రబాబు ఇవిఎంల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనకు తగదని జగన్ అన్నారు. నంద్యాల బైఎలక్షన్లో ఇవిఎంలతో ఎన్నికలు జరిగాయి 30వేల ఓట్లతో టీడీపీ గెలవలేదా అని ప్రశ్నించారు. అదే విధంగా మూడు నెలల ముందు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బిెజెపి ఓడిపోలేదా అని జగన్ గుర్తు చేశారు.
ప్రజల గాలి తన వైపు లేదని చంద్రబాబు తెలుసుకొని నేడు ప్రజాస్వామ్యాన్ని, ఓటర్ల తీర్పును అవహేళన చేస్తున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు ఐదేళ్ల అన్యాయ, అధర్మ పరిపాలన చూసిన ప్రజలు విసిగెత్తిపోయి బాయ్ బాయ్ బాబు చెప్పారని జగన్ అన్నారు. ఓడిపోతున్నానని చంద్రబాబు తెలుసుకుని ఇవిఎంలను సాకుగా చూపుతున్నారు అని జగన్ ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితర వైసిపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.