అమరావతి: ‘తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట’ ఆలా ఉంది మూడు రాజధానుల ప్రకటన అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ సిఎం చేసిన ప్రకటన పై పవన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పడి దాకా!మరి జగన్ రెడ్డిగారి మూడు రాజధానుల నగరాలు అసలు అయ్యేనా? పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటి దాకా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అనిచ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమి ఒరగలేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు.
కమిటీ రిపోర్ట్ రాకమునుపే జగన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించే కాడికి , అసలు కమిటీలు వెయ్యడం దేనికి?నిపుణుల్ని అపహాస్యం చెయ్యటం దేనికి? అని పవన్ ప్రశ్నించారు.
ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతారా? మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలని పవన్ అడిగారు.