(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: బోస్టన్ గ్రూపు నివేదిక ఒక చెత్త కాగితం, దానికి విశ్వసనీయత లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల వ్యవహారంపై బోస్టన్ గ్రూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఇచ్చిన నివేదికపై ఆయన శనివారం మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిఎన్ రావు కమిటి, బోస్టన్ కమిటీ నివేదికలను తగులబెట్టి నిరసన తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బిసిజి ఎప్పుడు వేశారని ప్రశ్నించారు. క్లయింట్ ఏది కావాలంటే అది రాసిచ్చే సంస్థ బిసిజి అని ఆరోపించారు. బిసిజి గ్రూపుతో వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నారు. బిసిజికి విశ్వసనీయతే లేదని అన్నారు. అజయ్ కల్లాం చెప్పింది జిఎన్ రావు కమిటీ రాసిచ్చిందని విమర్శించారు. తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేయడం సరికాదని అన్నారు. ఎవరిని మోసం చేయడానికి హైపవర్ కమిటీ వేశారని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతమే రాజధానికి అనుకూలమని శివరామకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
విశాఖకు రాజధాని తరలించినా అక్కడా భూములు కొనుగోలు చేయాల్సిందేనని చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లా ఇన్చార్జ్గా విజయసాయిరెడ్డి ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. భూముల సెటిల్మెంట్లకు ఎసిపిని పెట్టారన్నారు. అక్కడ మాట వినలేదని నిజాయితీపరుడైన జాయింట్ కలెక్టర్ను బదిలీ చేశారని విమర్శించారు. కావాల్సిన మనుషులను పెట్టుకొని విశాఖలో సెటిల్మెంట్లు చేస్తారా అని మండిపడ్డారు. నేరాలు చేయడంలో వైసిపి నేతలు దిట్టలని విమర్శించారు. ఒక వ్యక్తి ఉన్మాద ప్రవర్తనతో ప్రజలు జీవితాంతం బాధపడాలా అని ప్రశ్నించారు. కుప్పం నుంచి విశాఖ వెళ్లాలంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందో తెలుసా అన్నారు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారా అని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ ఒక చోట, సచివాలయం మరొక చోట లేవని అన్నారు.
ఇప్పటికే రాజధానులున్న దేశాలకు, రాజధాని లేని మన రాష్టానికి పోలికేమిటని ప్రశ్నించారు చంద్రబాబు. బిసిజి రిపోర్ట్లో పేర్కొన్న మూడు దేశాలకు సంబంధించి రాజధానులు ఏవైతే చెప్పారో అవన్నీ ఆల్రడీ ఆ దేశాలకు ఎగ్జిస్టెన్స్ కేపిటళ్లుగా ఉన్నాయన్నారు. మనం మాట్లాడేది రాజధాని లేని రాష్ట్రం గురించి అని చంద్రబాబు అన్నారు. డొడోమా (టాంజానియా) దారుసలామ్ రాజధాని ఉండగా, సెంట్రల్లీ లొకేటెడ్గా డొడోమా నగరాన్ని అభివృద్ది చేశారనీ, జనాభా అంత రాలేదని అనడం పూర్తి గా తప్పని అన్నారు. పిపిపిలో దానిని అభివృద్ది చేస్తోంది 2,500ఎకరాల్లోనే..అందులో కూడా ఏడు లక్షల జనాభా వచ్చిందన్నారు. అది వీళ్లు తక్కువగా అంటున్నారన్నారు.
జయవర్దన్ పురె కొట్టే (శ్రీలంక): శ్రీలంకకు ఆల్రడీ కేపిటల్ ఉంది. చారిత్రకంగా లంక రాజుల భవనాలు, బుద్దిస్ట్ మాన్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి చారిత్రక అంశాల ప్రాతిపదికన కేపిటల్ గా దానిని నోటిఫై చేశారే తప్ప ‘అది ఇంకా మున్సిపాలిటీనే.’నని వివరించారు. పుత్రజయ(మలేసియా): ఆల్రడీ ఉన్న కేపిటల్ డెవలప్మెంట్లో ఉండగా ఇంకొకటి టేకప్ చేశారని చెప్పారు. ఇవన్నీ రాజధానులు ఉన్న దేశాలు.మనది రాజధాని లేని రాష్ట్రం. దానికీ దీనికీ పొంతనలేదని చంద్రబాబు అన్నారు.
సీఎం జగన్కు ధైర్యముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అసలు ఇంత వరకూ రాజధానితో పాటు మిగిలిన వాటికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. ‘అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు వాటిని పొడిచి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగే ధైర్యం రాష్ట్ర ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. టిడిపి కార్యకర్తలపై కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులను మళ్ళించారు, నిరుద్యోగ భృతి, విదేశీ విద్యకు సాయం ఆపేశారని అన్నారు. ఏడు నెలల్లో ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో ప్రభుత్వం చెప్పాలన్నారు.