(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్తో పాటు విశాఖ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్లు గైర్హజరయ్యారు. రేపటి నుండి మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. సభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై వ్యూహరచన చేస్తున్నారు. మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వం ఏ రూపంలో బిల్లు తెస్తుందీ, ఆ సమయంలో ఎలాంటి వ్యాహం అవలంబించాలి తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హజరుకావాలని సభ్యులందరికీ ఇప్పటికే విప్ జారీ చేశారు. అయితే టిడిఎల్పి సమావేశానికి ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలుగా ముద్రపడిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్లతో పాటు విశాఖ ఎమ్మెల్యేలు ఇద్దరు, ఇచ్చాపురం ఎమ్మెల్యేలు రాలేదు.
విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడంతో విశాఖ ఎమ్మెల్యేలు సందిగ్దంలో పడ్డారని తెలుస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సొంత నియోజకవర్గాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయంతోనే వారు టిడిఎల్పి సమావేశానికి హజరాకాలేదని తెలుస్తోంది. ఈ భేటీకి గైర్హజరైన ఎమ్మెల్యేలలో బెందాలం అశోక్ మాత్రం పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో సమావేశానికి హజరుకాలేకపోతున్నానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.