ఒకే వారంలో రెండు సంఘటనలు – పతాక శీర్షికలతో ప్రాధాన్యత! ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరాన్ని సిబిఐ పోలీసులు అరెస్ట్ చేయడం. ఈ వార్త చాలా సంచలనం కల్గించింది. వివరాలు పరిశీలిస్తే ఐఎన్ఎక్స్ టెలివిజన్ న్యూస్ ఛానల్ వ్యవహారంలో అవినీతి జరిగిందనే విషయానికి సంబంధించి ఈ హడావుడి, వార్తా విశేషం. సిబిఐ పోలీసులు గోడదూకి కస్టడీలోకి తీసుకున్నారని వార్తలు రాగానే ఒకటి, రెండు ఫోటోలతో; చిన్న వీడియోతో చాలాసేపు వార్తను ఇచ్చారు. వార్తాస్థలం ఢిల్లీ కనుకా; సిబిఐ అధికారులే గోడలు దూకినపుడు మీడియాకు ప్రవేశం ఉండే వీలులేదు. రిపోర్టర్తో ఫీల్డ్ రిపోర్టింగ్, లేదంటే ఆ ఛానల్లోనే అందుబాటులో ఉన్న ఎడిటర్తో వ్యాఖ్య చేయించారు.
తెలుగులో దాదాపు అన్ని న్యూస్ఛానళ్లూ ఈ అంశానికి విశేష ప్రాధాన్యత ఇచ్చి, ప్రసారం చేశాయి. ఐతే ఈ విషయంలో ఈటీవీ వారి రెండు తెలుగు వార్తాఛానళ్ళు కాస్త విభిన్నంగా కనబడ్డాయి. ఈ అరెస్ట్ ముందు మాజీ మంత్రి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తనేమీ తప్పు చేయలేదనే చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్మీట్ బైట్కు మిగతా న్యూస్ఛానళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఈటీవీ ఛానళ్ళు మాత్రం ఈ బైట్ను సుమారు తొమ్మిది, పది నిమిషాలలో రెండుసార్లు ప్రసారంచేసినట్లు గమనించాను. ఇంకా ఎక్కువసార్లు ఇచ్చారేమో తెలియదు. ఒకవైపు ఆయన అరెస్ట్ అయ్యారని సిబిఐ పోలీసులు చెబుతుంటే, ఆ దృశ్యాలు అందుబాటులో ఉండగా; ఆయన తప్పు చేయలేదని చెప్పిన పాత వార్తను పదేపదే ఎందుకు ప్రసారం చేయడం? ఇలాంటి పరిశీలనలకు సదరు టీవీ ఛానల్ సమాధానం చెప్పదు. ఫలితంగా ఎవరికి తోచిన వ్యాఖ్యానం వారు చేసుకునే వీలుంది. అది ఛానల్ విశ్వసనీయతకు ప్రమాదం కాగలదు.
చిదంబరం చేసిన తప్పిదాలలో ఐఎన్ఎక్స్ ఛానల్ వ్యవహారానికి సంబంధించి ఇది. ఆ ఛానల్ బాధ్యులు పీటర్ ముఖర్జీ, భార్య ఇంద్రాణి ముఖర్జీ ఇది వరకే సొంత కూతురి హత్యకు సంబంధించి కేసు ఎదుర్కొంటున్నారు. ఐఎన్ఎక్స్ వ్యవహారంలో ఆవిడ అప్రూవర్గా మారటం ఇటీవలి పరిణామం.
గత బుధవారం (ఆగస్టు 21న) సిబిఐ వారు ఎన్డిటీవీ బాధ్యులు ప్రణయ్ రాయ్ దంపతులపై బ్రైబరీ, ఎఫ్.డి.ఐ. నియమాల అతిక్రమణల విషయమై ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేశారు. అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజమైన జి.ఇ.సంస్థకు చెందిన ఎన్ బి సి యూనివర్సల్ 150 మిలియన్ డాలర్ల కుంభకోణంలో రాయ్ దంపతులు తప్పిదం చేశారని అభియోగం. అంతకు ముందు ఆగస్టు 9న ఐసిఐసిఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయలు నష్టం కల్గించారన్న అభియోగంతో లుక్ అవుట్ నోటీసులు కారణంగా వారిని కెన్యా వెళ్ళకుండా ముంబై ఎయిర్పోర్ట్లో ఆపివేశారు. ఇవి చాలాకాలంగా అడపాతడపా వార్తల్లో వస్తున్న విషయాలే! ఇటీవల ఆ సంస్థ అధికారులు విక్రంచంద్ర, మరో మహిళ రాజీనామా చేశారని సమాచారం.
రాయ్ దంపతులు 1988లో ఎన్డిటీవీ పేరుతో దూరదర్శన్కు ప్రతి శుక్రవారం రాత్రి పదిన్నరకు ‘ది వరల్డ్ దిస్ వీక్’ అనే అరగంట కార్యక్రమం ఇచ్చేవారు. తర్వాతి దశలో స్టార్ న్యూస్కు కేవలం కంటెంట్ ఇచ్చేవారు. ఇంతవరకు బాగానే ఉంది. 2003లో రెండు సొంత ఛానళ్ళు ప్రారంభించడంతో సమస్యలు మొదలయ్యాయని అంటారు. ఈ విషయాలు గమనించినప్పుడు పాత్రికేయులు వాణిజ్యవేత్తలుగా రూపాంతరం చెందినపుడే ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వివరాలు ఇలా ఉండగా పాతకేసులు ఇప్పుడు తోడటమేమిటి అనే ప్రశ్న కూడా ప్రధానంగా వినబడుతోంది. పోరాట పథంలో ఛానల్ సాగడం వల్లనే ఇలాంటివని కొందరు విమర్శకులు బిగ్గరగానే అంటున్నారు. ఈ విమర్శలో కూడా నిజానిజాలు పరిశీలించాలి. అయితే అదే సమయంలో సంస్థలను నిర్వహించే పాత్రికేయులు అవినీతిలో భాగస్వాములు కావడం బాధాకరం.
అన్నట్టు ఇటీవల ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో ఒక తమాషా అంశం ప్రసారమైంది. అది పరిశోధనాత్మక కథనాలు ప్రసారం చేసే స్లాట్. అభిమానులకూ, పరామర్శకులకు షేక్హ్యాండ్ ఇవ్వడం వల్ల చంద్రబాబుకు చెయ్యి నొప్పి వచ్చిందని ఒక వివరణాత్మక కథనం ప్రసారం చేశారు. ఇంత ఆలస్యంగా ఇది ప్రసారం చేయడం ఆలోచనాత్మకం.
– డా. నాగసూరి వేణుగోపాల్