టీవీ న్యూస్ ఛానళ్ళు చూపించేందుకు ఏమేమి విషయాలున్నాయి? ఈ విషయాన్ని ఛానళ్ళు అంటే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు ఆలోచించే అవకాశాలు తగ్గి చాలా కాలమైంది. దాంతో వీక్షకులు కూడా ఛానళ్ళు ప్రజలకు పనికి వచ్చే విషయాలు చూపించవచ్చన్న సంగతి మరచిపోయారు. మూడు రోజుల క్రిందట టీవీ-9 ఛానల్లో కొండగట్టు ప్రమాదంలో బలైన వారి గురించీ, వారి మూడు గ్రామాల గురించీ వివరమైన కథనం ప్రసారం చేశారు. నిజానికి చాలా దారుణమైన ప్రమాదం అది. దీనికి సంబంధించి చాలా కోణాలున్నాయి. బాధితుల గోడు, జరగని న్యాయం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వీరు ఎవరికి చెప్పుకోవాలి తమ గోడు? ఎవరు వీరి గోడు వింటారు? దీన్ని ఎందుకు ప్రసారం చేశారో, ఏమో గానీ – చేసి చాలా మంచి పని చేశారు. ఇదే కాదు ఇలాంటి సంఘటనలు, ముఖ్యమైన అంశాల ఫాలో అప్ కథనాలు బోలెడు ఇవ్వవచ్చు. ఇటీవలి ఎన్నికల ముందు మద్రాసులో బంగారం దొరికింది. తర్వాత ఏమైందో తెలియదు. రవి ప్రకాష్, శివాజీల విషయం ఏమిటో, ఏమైందో తెలియరావడం లేదు. ఇలాంటివే కాదు గ్రామ సీమల్లో, కొండకోనల్లో ఏమి జరుగుతుందో పట్టించుకోవచ్చు.
కేవలం బంజారాహిల్స్, జూబిలీ హిల్స్ లోనే తమ భావనల్లోంచే కథనాలు తయారు చేసుకుంటే – ముప్పయి కాదు అరవై న్యూస్ ఛానళ్ళున్నా వార్తల తీరు ఇలానే ఉంటుంది. ప్రజలు కూడా మీడియాను పట్టించుకోరు. ఎడిటోరియల్ పాలసీగా ప్రజలకు పనికివచ్చే కథనాలు, ఫాలో అప్ వార్తలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఇటు గ్రామీణ విలేఖరులు, అటు పట్టణ విలేఖరులు మరింత బాగా పనిచేస్తారు.
ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా చెప్పాలి. ఇటీవల ఈ.ఎస్.ఐ. లో మందుల కొనుగోళ్ళ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని హైదరాబాదులో గుప్పుమంది. వైద్యంలో అవినీతి, మోసం దేనికి దారితీస్తుందో ఎవరూ ఎవరికీ చెప్పనక్కరలేదు. కానీ అవినీతి చాలా పెద్ద స్థాయిలో జరిగింది. ఎలా జరిగిందీ, ఎవరు మూలకారణమో, ఎవరు మూల విరాట్టో – ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఒక ఐఎఎస్ అధికారీ, ఒక ఛానల్ జర్నలిస్టూ భాగస్వాములట! ఈ వివరాలు చెప్పడంలేదు. దాచి పెట్టారు. ఇన్ని వార్తా ఛానళ్ళు, ఇన్ని వార్తా పత్రికలుంటే అవి బయటికి రాకపోవడం ఆశ్చర్యం కదా! దాన్ని బట్టి వారెంత బలవంతులో తెలుస్తున్నది. నీరా రాడియా టేపుల భాగోతం గురించి దేశంలోని 24 గంటలు వార్తా ఛానళ్ళు, దినపత్రికలూ రాయలేకపోయాయి. చివరకు ‘అవుట్ లుక్’ వారపత్రికా, ‘ఓపెన్’ మాసపత్రికా దిగితే కానీ వాస్తవాలు బయటికి రాలేదు. మరి ఈ మందుల స్కామ్ జర్నలిస్టూ, ఛానల్ వివరాలు బయటికి ఎప్పుడు వస్తాయో!
అక్టోబరు 2 వస్తోంది, మహాత్మా గాంధీ 150వ జయంతి సంవత్సరం ముగుస్తోంది. అయితే తెలుగు వార్తా ఛానళ్ళు ‘సైరా’ అని అరగంట పాటు జపం చేస్తున్నాయి. వాటిల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా చిరంజీవి గురించే ఎక్కువ ఉంటోంది. అవి పైకి పరిచయాలుగా, కార్యక్రమాలుగా కనిపిస్తున్న సినిమా ప్రమోషన్ ప్రకటనలే! సాహో, వాల్మీకి, ఇపుడు సైరా!
సరే అసలు అక్టోబరు 2కు వద్దాం. ఇంకా టీవీ ఛానళ్ళకు గాంధీ గుర్తుకు రాలేదు. పత్రికలు కొంత వరకు ప్రారంభించాయి గాంధీని గుర్తు చేయడం, పలు కోణాల్లో సమాచారం ఇవ్వడం. టీవీది ఒక ఉప్పెన పోకడ. ఒక్క దూటున అన్ని ఛానళ్ళు ఒకే రకం సమాచారంతో విరుచుకు పడతాయి – అవి ఆరోగ్య కార్యక్రమాలయినా, ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా! నిజానికి ఈ ధోరణి తుఫాను వచ్చినపుడు మాత్రమే ఉపయోగపడుతోంది. విక్రం సారాభాయి గురించి ఎంతమంది టీవీ యజమానులకూ, టీవీ జర్నలిస్టులకు తెలుసు. ఆయన ఎంతో ముందు చూపుతో ఈ దిశలో కృషి ఉపయోగపడుతుందని అంతరిక్ష విజ్ఞానంవైపు దృష్టి పెట్టి ఘనవిజయాలు సాధించారు. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విసిరివేశారు కనుకనే, ఛానళ్ళు ఆ ఉపగ్రహాల సాయంతో అందరిని చేరుతున్నాయి.
డా. నాగసూరి వేణుగోపాల్