హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో దుమారం రేగుతున్న మూడు రాజధానుల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ లేదని అన్నారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల నష్టమే తప్ప లాభం ఉందని తెలిపారు. ప్రజా ధనం భారీగా వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక భారమైన అన్ని రాజధానుల నిర్మాణానికి ఎందుకు పూనుకుంటున్నారని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ఉనికిని చాటుకోవడం కోసమే, రాజధానులు, కొత్త నిర్మాణాల అంశాన్ని లేవనెత్తుతున్నారని వీహెచ్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రం.. రాజధాని విషయంలోనూ జగన్ను నియంత్రించాలని కోరారు. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం నిలిపివేయాలని, బ్యాంకు రుణాలు రాకుండా అడ్డుకోవాలని సూచించారు.
ఇదిఇలా ఉంటే.. ఏపీకి మూడు రాజధానుల అంశంపై ఇటీవల ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనకు మద్దతు పలికిన ఆయన తెలంగాణలోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని, ఏడాదికి రెండు సార్లు శాసనసభ సమావేశాలు ఆదిలాబాద్లో నిర్వహించాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.