(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీ రాజధానిపై ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జీఎన్ రావు కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ ని కలిసి నివేదికను సమర్పించారు. రిపోర్టులోని ముఖ్యమైన అంశాలను సీఎం జగన్కు వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కమిటీ పర్యటించింది. ప్రజలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. అదే రోజు కేబినెట్లో ఆమోదించిన తర్వాత ఈ నివేదికలోని అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయనుందని సమాచారం.
రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు సెప్టెంబర్ 13న ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ మూడో వారం నుంచి పని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడంతోపాటు మెయిల్ ద్వారా కూడా అభిప్రాయాలను సేకరించింది. జీఎన్ రావు కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ప్రజాసంఘాలు, మేధావులు, సామాన్య ప్రజలతో చర్చించింది.
నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో ప్రకటించారు. ఈ కమిటీ పూర్తి నివేదిక ఇవ్వకముందే మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీలో జగన్ సంకేతాలు ఇచ్చారు. తాజాగా జీఎన్ రావు కమిటీ పూర్తిస్థాయి నివేదికను సీఎంకు సమర్పించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏం చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. జీఎన్ రావు నేతృత్వంలోని ఈ కమిటీలో డాక్టర్ కేటీ రవీంద్రన్, డా.మహవీర్, డా. అంజలికరోల్ మోహన్, డా. ఏవీ సుబ్బారావు, కేబీ అరుణాచలం, విజయమోహన్ సభ్యులుగా ఉన్నారు.
ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చు అంటూ సీఎం జగన్ చేసిన రాజధాని ప్రాంత రైతులను ఆగ్రహానికి గురిచేసిన సంగతి తెలిసిందే. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జగన్ తన ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికలో ఏం ఉందన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.జగన్ చెప్పినట్టే మూడు రాజధానుల ఏర్పాటునే కమిటీ కూడా ప్రతిపాదించిందా..? లేక అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పిందా..? అన్నది వేచి చూడాలి.